సిటీబ్యూరో/చాంద్రాయణగుట్ట, జూన్ 23 (నమస్తే తెలంగాణ): లైంగిక దాడి కేసుపై వివరాలు తెలుసుకోవడం కోసం పోలీస్స్టేషన్కు వెళ్లిన జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహజాది చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఠాణాలో ఆమె ఇన్స్పెక్టర్ సీట్లో కూర్చున్న వీడియో గురువారం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఇటీవల చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఆ ఘటనలో నింధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఆమె బుధవారం పోలీస్స్టేషన్కు వెళ్లారు. ఠాణాలోకి వెళ్లి ఆమె ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ సీట్లో కూర్చోగా, ఇన్స్పెక్టర్ ఆమె ముందు సీట్లో కూర్చున్నారు. పోలీస్స్టేషన్ సిబ్బంది అందరూ నిల్చోని ఉన్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
మైనార్టీ కమిషన్ సభ్యులు పోలీస్స్టేషన్కు రావడం, స్టేషన్లో పంచాయతీ పెట్టడమేమిటంటూ నెట్జన్లు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆమె స్టేషన్కు వచ్చి, ఇన్స్పెక్టర్ సీట్లో కూర్చోవచ్చా..? నిబంధనలు అతిక్రమించారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలి ప్రొటోకాల్ ఏమిటీ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఘటన పోలీసులను కూడా తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాఉండగా ఈ విషయంపై సౌత్జోన్ డీసీపీ సాయి చైతన్యతో మాట్లాడగా, విషయం తమ దృష్టికి వచ్చిందని పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా సయ్యద్ షహజాది చాంద్రాయణగుట్ట నుంచి గతంలో బీజేపీ తరఫున పోటీ చేసింది.