ముషీరాబాద్, జూన్ 23: హుస్సేన్ సాగర్ నాలాపై అశోక్నగర్ వద్ద చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇరుకు వంతెన విస్తరణలో భాగంగా చేపడుతున్న నాలాపై చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో నాలా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్కు మార్గంలో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి.
వీఎస్టీ-ఇందిరా పార్కు మార్గం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్టీలు వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా అశోక్నగర్ వద్ద సాగర్ నాలాపై వంతెనను విస్తరిస్తున్నారు. సాగర్ నాలాపై ప్రస్తుతం ఉన్న వంతెన ఇరుకుగా ఉండటం, అక్కడి దాకా రాగానే ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికిగాను ప్రస్తుతం ఉన్న వంతెనకు తోడు ఇరువైపులా అదనపు బ్రిడ్జిలను నిర్మించి రోడ్డును విశాలంగా మార్చాలనే ప్రతిపాదనతో అధికారులు అశోక్నగర్-ఇందిరాపార్కు మార్గంలో ఒక వైపు వంతెన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. దాదాపు యేడాదిగా చేపడుతున్న పనులు తుది దశకు చేరుకోగా త్వరలో మిగతా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తే అశోక్నగర్ వద్ద ట్రాఫిక్ జామ్ సమస్యకు పరిష్కారం లభించనుంది.
విస్తరణ ప్రతిపాదన ఇలా…
అశోక్నగర్ బ్రిడ్జి విస్తరణలో భాగంగా ముందు అశోక్నగర్ నుంచి ఇందిరాపార్కు వైపు తొమ్మిది మీటర్ల మేర విస్తరణ పనులు(బ్రిడ్జి నిర్మాణం) చేపడుతున్నారు. ఈ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఇక రెండో వైపు ఇందిరాపార్కు-అశోక్నగర్ మార్గంలో నాలాలో ఇదివరకే పిల్లర్ల నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో పక్కనే ఉన్న భవనాన్ని తొలగించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
త్వరలో తీరనున్న ట్రాఫిక్
వీఎస్టీ-ఇందిరాపార్కు మార్గంలో ట్రాఫిక్ సమస్యే లేకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా స్టీలు వంతెన నిర్మాణం, అశోక్ నగర్ వంతెన విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం సాగర్ నాలాపై చేపడుతున్న వంతెన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం.
-ముఠా గోపాల్, ముషీరాబాద్ ఎమ్మెల్యే