సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరాభివృద్ధికి సూచికలు రహదారులు..ప్రజా రవాణా వ్యవస్థేనని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. 8ఏండ్లలో రాష్ట్ర ప్రభుత్వం నగరంలో 30 ఫ్లై ఓవర్లు నిర్మించిందని..మరో 17 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాదిలో ఆరు, మిగిలినవి వచ్చే ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కూకట్పల్లి పరిధిలోని కైత్లాపూర్ వద్ద రూ. 84 కోట్లతో నిర్మించిన ఆర్వోబీని మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నగరంలో ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెరుగైన రవాణా వసతులు కల్పించేందుకుగానూ ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి – ఉప్పల్ నుంచి శేరిలింగంపల్లి వరకు అండర్ పాసులు, ఆర్వోబీలు, ఫె్లైఓవర్లు మొదటి దశలో ఎస్ఆర్డీపీ ద్వారా రూ. 8052 కోట్ల వ్యయంతో 47 పనులు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో ప్రజలు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెండో దశలో రూ. 3115 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు.
వరద నివారణకు శాశ్వత చర్యలు
మొదటి సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీళ్లు, కరెంట్, రోడ్లు బాగు చేస్తుకున్నాం..ఈ సారి హైదరాబాద్లో నాలాలను బాగు పర్చుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమం చేపట్టి రూ. 1000కోట్లతో నాలాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, త్వరలోనే రెండవ దశ పనులు చేపట్టి వరద నివారణకు శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు. నాలాలపై ఇండ్లు నిర్మించుకున్న వారిని గుర్తించి వారిని డబుల్ బెడ్ రూం ఇండ్లు చేర్చుతామన్నారు. ఇందుకు పేదలు సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. చెరువులను సుందరీకరణ పనులు చేపడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు త్వరలో పంపిణీ చేస్తామని, రెండు పడక గదుల ఇళ్లను అర్హులైన వారికి పారదర్శకంగా అందించేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు, ఇందుకోసం అందరి సమక్షంలో లకీ డ్రా తీసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐడీఎల్ చెరువు సుందరీకరణకు చర్యలు తీసుకుంటామని, మూసాపేటలో హౌసింగ్ సీం కోసం స్థలం కేటాయించినట్లు, కూకట్పల్లి బాలానగర్లో వంద పడక గదుల ఆసుపత్రి పనులకు శంకుస్థాపన చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు కురయ్యగారి నవీన్కుమార్, శంభీపూర్ రాజు, సురభి వాణీదేవి, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు, కలెక్టర్ హరీశ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, కార్పొరేటర్లు పగుడాల శిరీషాబాబురావు, సబీహాబేగం, మందడి శ్రీనివాస్రావు, జూపల్లి సత్యనారాయణ, ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నర్సింహ యాదవ్, పండాల సతీశ్ గౌడ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు, కాండూరి నరేంద్రాచార్య, తూము శ్రవణ్కుమార్, ఆయా డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోదీకి పోటీ సీఎం కేసీఆరే
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి పోటీ సీఎం కేసీఆరేనని.. తెలంగాణ తరహాలో దేశాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో దేశంలోని ప్రతీ పల్లెకు తాగునీరు, సాగునీరు, కరెంటు, ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్షమన్నారు. దేశం కోసం ముందుకు సాగుతున్న కేసీఆర్కు యావత్ ప్రజానీకం మద్దతు లభిస్తుందన్నారు. ప్రభుత్వ సహకారంతో కూకట్పల్లిని స్వర్గసీమగా మార్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావుదేనన్నారు. నగరంలోనే మేడ్చల్ జిల్లా అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని.. నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలు సైనికుల్లా పనిచేస్తున్నారని కొనియాడారు.
కూకట్పల్లికి వరాల జల్లు
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ సభాముఖంగా వరాల జల్లు కురిపించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇండ్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆసరా పింఛన్లు, ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పంపిణీపై కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రజలకు తీపి వార్త అందించనున్నట్లు స్పష్టం చేశారు. బాలానగర్లో వందపడకల వైద్యశాలకు నిధులు మంజూరు చేసి త్వరలోనే మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుందామని ప్రజలకు తెలిపారు.
ఆదర్శవంతంగా అభివృద్ధి
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో కూకట్పల్లి నియోజకవర్గం కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి సాధించిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రూ.390 కోట్లతో 9 రిజర్వాయర్లు, తాగునీటి పైప్లైన్ల పనుల పునరుద్ధరణతో తాగునీటి కష్టాలు తీరాయని, పారిశ్రామికవాడలతో పాటు ప్రజలందరికీ 24 గంటలు నాణ్యమైన కరెంటు వస్తుందన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి బాలానగర్లో రూ.400 కోట్లతో ఫ్లైఓవర్, కేపీహెచ్బీ కాలనీలో రూ.100 కోట్లతో ఫ్లైఓవర్, కాలనీ 7వ ఫేజ్లో రూ.60 కోట్లతో రైల్వే అండర్పాస్ బ్రిడ్జిని నిర్మించారని.. తాజాగా రూ.86 కోట్లతో నిర్మించిన కైత్లాపూర్ ఆర్వోబీ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాలన్నీ తీరాయని అన్నారు. అలాగే రూ.385 కోట్లతో తొమ్మిది చెరువుల వద్ద ఎస్టీపీలను ఏర్పాటు చేసి మురుగునీటిని శుద్ధి చేసే పనులను చేపట్టామని పేర్కొన్నారు.
శివారు ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో నగర శివారు ప్రాంతాలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు జరిగాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కైత్లాపూర్ ఆర్వోబీ ప్రారంభోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లిలో నిర్మించిన ఫ్లై ఓవర్లతో కుత్బుల్లాపూర్లో నివసిస్తున్న ప్రజలకు ఎక్కువగా ప్రయోజనం ఉందన్నారు. చింతల్, ఐడీపీఎల్, జగద్గిరిగుట్ట, షాపూర్నగర్ పరిసరాల్లో నివసించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సామాన్యులు హైటెక్ సిటీకి వెళ్లేందుకు కైత్లాపూర్ ఆర్వోబీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పట్టణ ప్రగతిలో ప్రజల వద్దకు వెళ్తే చేసిన పనులకు సంతోషిస్తూ నేతలకు సన్మానాలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ జాతీయ నాయకుడిగా.. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నదే ప్రజల అభిమతమని అన్నారు.
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు
కూకట్పల్లి కైత్లాపూర్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ఖాన్, అల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షఫీలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.
బోనాలు,బతుకమ్మలతో సందడి..
మంత్రి కేటీఆర్కు బోనాలు, బతుకమ్మలు, కోలాటంతో మహిళలు స్వాగతం పలికారు. ఫ్లైఓవర్కు వెళ్లే దారిలో మహిళలు బతుకమ్మలు ఆడారు. ఒంటెలు, గుర్రాలతో స్వాగతం.. కళాకారుల నాట్య విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. మంత్రి కేటీఆర్ వెళ్లే దారిలో పూలవర్షాన్ని కురిపించి తమ ఆనందాన్ని చాటుకున్నారు.