ఘట్కేసర్, జూన్ 21: ఎలాంటి అనుమతి లేని ప్రైవేటు పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. అయినా.. ఆ పాఠశాల యాజమాన్యం విద్యాసంస్థను కొనసాగిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నది. పోచారం మున్సిపాలిటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో శ్రీచైతన్య పేరుతో పాఠశాలను ఏర్పాటు చేసి, వేసవి సెలవులకు ముందే అడ్మిషన్లు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఈ పాఠశాల వ్యవహారంపై ఆరా తీశారు. ఈ పాఠశాలకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదన్న విషయం బయటపడింది. దీంతో డీఈఓ, ఎంఈఓ పాఠశాలను ఏప్రిల్ 22న సీజ్చేసి, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన ద్వారం సీజ్ చేసి ఉన్నా.. భవనం వెనుక ఉన్న మరో ద్వారం గుండా లో నికి ప్రవేశించి అడ్మిషన్లు ఇచ్చారు. అంతేకాదు.. ఈనెల 20 నుంచి వెనుక ద్వారం నుంచే పాఠశాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఎలాంటి అనుమతి లేదు..
శ్రీచైతన్య పాఠశాలకు అధికారుల నుంచి అనుమతి వచ్చిందంటూ యాజమాన్యం తప్పుడు ప్రచారం చేసుకొని పాఠశాలను నడుపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటాం.
-ఘట్కేసర్ ఎంఈఓ శశిధర్