సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : సిటీలో సులువుగా పాదచారులు రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ అందుబాటులోకి రానున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా రూ.8 కోట్లతో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 94 చోట్ల ఈ సిగ్నల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 70 చోట్ల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రోడ్డు దాటేందుకు పాదచారులు పెలికాన్ సిగ్నల్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న పుష్బటన్ నొక్కగానే, ఎంతసేపట్లో మీకు రోడ్డు క్లియర్ అవుతుందనే విషయాన్ని చెబుతుంది. రోడ్డులో అటు ఇటూ వెళ్లే వాహనాలు ఆగి, పాదచారులు రోడ్డు దాటేందుకు 12 సెకండ్ల నుంచి 15 సెకండ్ల సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో రోడ్డుపై పాదచారులకు ఆ రోడ్డు రాచబాటగా మారుతుంది.
రోడ్డు ప్రమాదాల నివారణే
పాదచారులకు రోడ్డు భద్రత కల్పించడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందే పాదచారుల సంఖ్య ఏడాదికి వందల్లోనే ఉంటున్నాయి. వీటిని వీలైనంత తగ్గిస్తూ, సురక్షితంగా పాదచారులు రోడ్డు దాటేందుకు సేఫ్సిటీ ప్రాజెక్ట్లో పెలికాన్ సిగ్నల్స్కు తగిన ప్రాముఖ్యతనిచ్చారు. రద్దీగా ఉండే ప్రాంతాలైన మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అబిడ్స్, ట్యాంక్బండ్, హిమాయత్నగర్, బేగంపేట్ తదితర ప్రాంతాలలో ఈ సిగ్నల్స్ ఏర్పాటయ్యాయి. ట్యాంక్బండ్పై రెండు చోట్ల ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి గంటకు 300 నుంచి 400 మంది ఒకో సిగ్నల్ వద్ద రోడ్డు దాటుతుంటారు. సాయంత్రం వేళ ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అదే మెహిదీపట్నం, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలలో అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో రోడ్డుపై ఒకటి నుంచి రెండు నిమిషాల వాహనదారుల రాకపోకలకు సిగ్నల్ పనిచేసిందంటే, రెండు వైపుల వాహనాలను ఆపేసి పాదచారుల కోసం 15 సెకండ్ల వరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో పెలికాన్ సిగ్నల్ వద్ద వేచి ఉన్న వాళ్లు రోడ్డు దాటేస్తారు. 15 సెకండ్ల సమయం పూర్తికాగానే వాహనాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తోంది. వాహనాలకు నిర్ణయించిన సమయం పూర్తికాగానే, అప్పటి వరకు పెలికాన్ సిగ్నల్ వద్ద ఎదురు చూస్తున్న వారికి గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది.