బంజారాహిల్స్, జనవరి 31: కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 37 ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోనందున కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో శానిటైజేషన్ పనులు చేపట్టారు. చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు అన్ని తరగతి గదుల్లో సోడి యం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో శానిటైజేషన్ పనులు చేపట్టారు. స్కూల్కు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని, శానిటైజర్లను వాడటంతో పాటు విద్యాశాఖ జారీ చేసిన నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
పాఠశాలలు మంగళవారం నుంచి తిరిగి పున: ప్రారంభంకానుండటంతో హిమాయత్నగర్ జోన్ పరిధిలోని పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఒక్కో తరగతి గదిలో 20 మంది విద్యార్థులు కూర్చునే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు తప్పని సరిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని హిమాయత్నగర్ జోన్ డిప్యూటీ విద్యాశాఖాధికారి గాజుల శ్రీధర్ తెలిపారు. జీహెచ్ఎంసీ సహకారంతో పాఠశాలల్లో స్వచ్ఛతతో పాటు శానిటేషన్ పనులు చేపట్టామని వివరించారు.