అమీర్పేట్, జనవరి 28 : అమీర్పేట్ డివిజన్లో రూ. 2.43 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వీడీసీసీ రోడ్లు, సివరేజీ, మంచినీటి పైపులైన్ల నిర్మాణాల శంకుస్థాపనతో పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన నూతన పవర్బోర్ను ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని సుప్రభాత్నగర్లో రూ. 2.20 లక్షలతో చేపడుతున్న సివరేజీ లైన్ పనులు, బల్కంపేట బస్తీలో రూ.18.90 లక్షలతో చేపడుతున్న వీడీసీసీ రోడ్డు పనులు, ఎస్ఆర్నగర్ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాలు సమీపంలోని సాయి మెన్షన్ రోడ్డులో రూ.18.50 లక్షలతో వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు, బాపూనగర్ బస్తీలో రూ.10.50 లక్షలతో చేపట్టనున్న సివరేజీ పైపులైను నిర్మాణ పనులు, బస్తీలో రూ.3.60 లక్షలతో చేపట్టిన మంచినీటి పైపులైను పనులకు కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బాపూనగర్ బస్తీలో సీవరేజీ, మంచినీటి పైపులైను నిర్మాణం పూర్తయిన వెంటనే వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బల్కంపేటలో నిర్మించిన వైట్ట్యాపింగ్ రోడ్లపై ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ను ఇంకా ప్రారంభించలేదంటూ బస్తీ వాసులు మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, ఈఈ ఇందిర, జలమండలి జీఎం హరిశంకర్, ఏఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, ఎలక్ట్రికల్ డీఈ కిరణ్మయితో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.