దేశ, విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలు..కండ్లు చెదిరే భవనాలు.. విలాసవంతమైన హోటళ్లు.. విశాలమైన రహదారులతో ఐటీ కారిడార్ నగరానికి ఐకానిక్గా మారింది. విదేశాలను తలపించేలా ఇక్కడ వసతులు అందుబాటులో ఉన్నాయి. ఇదేస్థాయిలో ఆహ్లాదం ఇచ్చేలా, నేటితరం మెచ్చేలా టీఎస్ఐఐసీ ఆధునిక పార్కు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దుర్గంచెరువు మీదుగా రాయదుర్గం వెళ్లే ప్రధాన మార్గం పక్కన కొండ ప్రాంతాన్ని చదును చేసి పార్కుగా తీర్చిదిద్దనున్నారు.
సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ఆకాశాన్నంటే భవనాలు.. విశాలమైన రోడ్లు..హాయిగా సాగిపోయేలా ఫ్లై ఓవర్లు… ఇలా ఆధునికతకు మారుపేరుగా విరాజిల్లుతున్న ఐటీ కారిడార్ మహానగరానికి మణిహారంగా నిలుస్తున్నది. తాజాగా ‘ఐటీ’ వాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ‘హైటెక్’ నందనవనం రూపుదిద్దుకోబోతున్నది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) అత్యాధునిక డిజైన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కును నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దుర్గంచెరువు మీదుగా రాయదుర్గం వెళ్లే రహదారిలో ఉన్న పార్కు స్థలం కొండ ప్రాంతంగా ఉండడంతో దాన్ని కొంత మేర చదను చేసి.. అత్యాధునిక నందనవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అత్యాధునికంగా…
మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి ప్రారంభమై..గచ్చిబౌలి, కోకాపేట వరకు విస్తరించిన ఐటీ కారిడార్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పార్కును నిర్మించనున్నారు. హైటెక్ సిటీలోని నాలెడ్జ్ పార్కు, ఐటీసీ కోహినూర్ వెనుక భాగంలో టీఎస్ఐఐసీ ప్రతిపాదించిన ఈ అత్యాధునిక పార్కు డిజైన్లను అద్భుతంగా రూపొందించింది. చుట్టూ ఉన్న ఐకానిక్ భవనాలను దృష్టిలో పెట్టుకొని.. వీటిని తయారు చేసింది. సరికొత్త థీమ్తో పాటు సందర్శకులు హాయిగా సేద తీరేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దనున్నారు.