సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): నెట్టింట్లో లభిస్తున్న నకిలీ సిమ్కార్డులు, వర్చువల్ బ్యాంకు ఖాతాలతో మరింతగా రెచ్చిపోతున్నారు సైబర్నేరగాళ్లు. అమాయకులను సులువుగా బుట్టలో వేస్తున్నారు. ‘ఫేక్’లతో పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు.
నెట్టింట్లో సిమ్ సేల్
సైబర్నేరగాళ్లు నెట్టింట్లో ఎక్కడి నుంచి వీటిని పొందుతున్నారనే విషయాన్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించగలిగారు. ఇప్పటి వరకు కొన్ని ముఠాలు ఆగంతకులతో నేరుగా టచ్లో ఉండి.. అకౌంట్లు, సిమ్కార్డులు అందించేవారు. ప్రస్తుతం పంథా మార్చారు. సిమ్ సేల్ అంటూ..వాట్సాప్లో గ్రూప్లు క్రియేట్ చేసి..సరఫరా చేస్తున్నారు. వివిధ రకాలైన సర్వీస్లను అందిస్తామంటూ ప్రకటనలూ ఇస్తున్నారు.
ఇన్స్టాంట్ ఖాతాలు..
కరోనా తరువాత అనేక బ్యాంకులు ఇంటర్నెట్ నుంచి నేరుగా ఖాతాలు తెర్చుకునే వెసులుబాటు కల్పించింది. వర్చువల్ ఖాతాలకు ఆధార్కార్డు, పాన్ నంబర్, ఫోన్ నంబర్ను యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నెట్ నుంచి దొరికే ఆధార్కార్డు, పాన్ కార్డుల ఆధారంగా జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో సైబర్ నేరగాళ్లు సిమ్కార్డులు పొందుతున్నారు. ఆన్లైన్ ద్వారానే బ్యాంకు ఖాతాలను వర్చువల్గా తెరుస్తున్నారు. వీటి లిమిట్స్ రూ. 10 వేల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటున్నాయి. కొత్త పంథాలో కూర్చున్న చోటకే సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలు వచ్చి చేరుతుండడంతో సైబర్నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండాపోతున్నది.
ఒక్కోదానికి ఒక్కో ధర..
సిమ్ కావాలంటే రూ. 250, బ్యాంకు అకౌంట్, అటాచ్ సిమ్ కావాలంటే రూ. 890, లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసే అవకాశముందంటే రూ. 4 వేలు.. ఇలా ఒక్కో దానికి ధర నిర్ణయించి అమ్ముతున్నారు. ఇలా సోషల్మీడియా ద్వారా ఖాతాలు, సిమ్లు అందించే గ్రూప్లు ఎన్ని ఉన్నాయనే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎథికల్ హ్యాకింగ్తో ప్రధాన హ్యాకర్ను అరెస్టు చేసిన సైబర్క్రైమ్ పోలీసులు.. అతడు ఎలా ఖాతాలు సమకూర్చుకున్నాడు..? సిమ్కార్డులు ఎలా సేకరించాడనే అంశంపై వివరాలు సేకరించి.. దర్యాప్తు చేపట్టారు. సైబర్నేరగాళ్లకు కావాల్సిన ఖాతాలు, సిమ్లు అందించే గ్రూపులు సోషల్మీడియాలో చాలా వరకు క్రియేట్ అయినట్లు గుర్తించారు. అందులో ఎవరెవరూ ఉన్నరనే విషయంపై దృష్టి పెట్టారు. నెట్వర్క్లను ఛేదించే పనిలో ఉన్నారు.