సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25వేల కోట్ల అంచనాతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా తొలి విడత పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇందులో ఇప్పటికే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అరుదైన ఘనత సాధించింది. తాజాగా మైండ్స్పేస్ దగ్గర శిల్పా లే అవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం ఎస్ఆర్డీపీలో ఇదో అద్భుతమైన నిర్మాణంగా ముద్ర వేసుకోనున్నది.
ఫ్లై ఓవర్ నిర్మాణంలో స్టీల్ పోర్టర్ ఫ్రేమ్
శిల్పా లే అవుట్ వద్ద చేపడుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణంలో స్టీల్ పోర్టల్ ఫ్రేమ్స్ను అమర్చుతున్నారు. మూడు స్టీల్ పోర్టర్ ఫ్రేమ్స్ల ఏర్పాటులో ఒకటి బిగించగా, మరో రెండు బిగింపు పనులు జరుగుతున్నాయి. 23 మీటర్ల ఎత్తు, 14.5 మీటర్ల వెడల్పుతో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో తొలి స్టీల్ పోర్టల్ ఫ్రేమ్స్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఫ్లై ఓవర్ మార్గంలో మలుపులు, మూలలు వంటివి వచ్చే ప్రాంతాల్లో పోర్టల్ ఫ్రేమ్స్ను వాడుతారని, మెట్రో రైలు మార్గాల్లోనూ పలు ప్రాంతాల్లో ఇలాంటి పోర్టల్ ఫ్రేమ్స్ వినియోగించినట్లు ఇంజినీర్లు తెలిపారు. శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్కు పోర్టల్ ఫ్రేమ్స్ అవసరమైన మూడు చోట్ల కాంక్రీట్ పోర్టల్ ఫ్రేమ్స్ బదులు స్టీల్ ఫ్రేమ్స్ వాడటం నగరంలో ఇదే మొదటి సారి అని పనులను పర్యవేక్షిస్తున్న ఎస్ఈ వెంకట రమణ తెలిపారు.
18 మీటర్ల ఎత్తులో.. స్టీల్ గడ్డర్లు ఏర్పాటు
ఆగస్టు చివరి నాటికి ఈ ఫ్లై ఓవర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు వేగిరం చేశారు. ఫ్లై ఓవర్ మార్గంలో రద్దీ సమయంలో వాహనాలు గంటకు 1464 పీసీయూ కాగా 2040 నాటికి ఇది 5194 పీసీయూకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు వరుసల్లో నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్పై రెండు వైపులా ప్రయాణం చేయవచ్చు. అయితే మీనాక్షి టవర్స్ పరిసరాల్లో ఈ ఫ్లై ఓవర్ మార్గంలో మొత్తం మూడు పోర్టల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా కొండాపూర్ వైపు నుంచి ఓఆర్ఆర్ వైపు వెళ్లే పనుల్లో భాగంగా గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై రెండో వరుసలో భూమి నుంచి 18 మీటర్ల ఎత్తులో 64 మీటర్ల పొడవైన 3 స్టీల్ గడ్డర్లను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో స్పాన్ (మూడు గడ్డర్స్) బిగింపు ప్రక్రియ అత్యంత కీలక ఘట్టం కాగా.., అందులో అత్యంత ఆకర్షణీయంగా నిర్మాణం కనబడుతున్నది.
ఫ్లైఓవర్ విశేషాలు