ఖైరతాబాద్ జోన్ పరిధిలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జోన్ పరిధిలోని 17 ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ , గురుకుల పాఠశాలల్లో చదుకుంటున్న 7,655 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, రహ్మత్నగర్, షేక్పేట, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, బోరబండ. వెంగళరావునగర్, అమీర్పేట, సనత్నగర్ డివిజన్ల పరిధిలో 17 ప్రభుత్వ, 143 ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరితో పాటు 17మంది ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు రాస్తున్న వారిలో 3,877మంది బాలురు, 3,678మంది బాలికలు ఉన్నారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు శుక్రవారం నుంచి హాల్ టికెట్ల పంపిణీ ఆయా స్కూళ్లలో ప్రారంభమయింది. ఉదయం 9.30నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని. 45 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని వారు పేర్కొన్నారు. – బంజారాహిల్స్,మే 20
పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ
పదో తరగతి పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో 44 పరీక్షా కేంద్రాల్లో కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. చాలా స్కూళ్లలో ఇప్పటికే సీసీ కెమెరాలు పనిచేస్తుండగా, కొన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు లేకపోవడంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సౌకర్యం, లైటింగ్,ఫ్యాన్లు పనిచేసేలా అధికారులు ఇప్పటికే అన్ని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పరీక్షలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం. స్కూళ్లలో ఫ్యాన్లు , లైట్లతో పాటు విద్యుత్ సమస్యలు లేకుండా చూసుకోవాలని ఇప్పటికే ఆయా పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించాం. పరీక్షలు జరిగే తరగతి గదుల్లో సరైన గాలి వెలుతురు ఉండేలా చూడాలని ఆయా పాఠశాలల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. అన్ని పరీక్షా కేంద్రాలవద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని డిప్యూటీ డీఈవో చిరంజీవి తెలిపారు. – చిరంజీవి, డిప్యూటీ డీఈవో, ఖైరతాబాద్ జోన్