మియాపూర్, మే 20 : ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ లేదని, గుర్తించి అధికారులు ముందుకు సాగాలన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులపై శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ శంకరయ్య, డీసీ వెంకన్ననాయక్, కార్పొరేటర్లు హమీద్ పటేల్ , రాగం నాగేందర్యాదవ్, జగదీశ్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్, మంజులరెడ్డి సహా ఆయా విభాగాల అధికారులతో విప్ గాంధీ శుక్రవారం మియాపూర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో నాలాల విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని, ఎస్టీపీలను అనుసంధానమైన కాలువల నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. చందానగర్లోని రెడ్ది కాలనీలో ఎస్టీపీ ఔట్ లెట్ నిర్మాణానికి అడ్డంకులను తొలగించాలని గాంధీ పేర్కొన్నారు.
రహదారులపై నీరు నిలిచే ప్రాంతాల వద్ద తక్షణ మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. ఇంజినీరింగ్ జలమండలి విభాగాలు సమన్వయంతో పని చేయాలని, వర్షాల నేపథ్యంలో నాలాలు, మ్యాన్ హోళ్ల వద్ద కనీస రక్షణ చర్యలను చేపట్టాలని సూచించారు. చెరువుల సుందరీకరణ పనులలో వేగం పెంచాలని గాంధీ పేర్కొన్నారు. శ్మశానాల అభివృద్ధి, శ్మశానాల అభివృద్ధి పనులలో పురోగతి సరిగా లేదన్నారు. జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతిని నియోజకవర్గంలో విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వంశీమోహన్, ఆర్ఐలు శ్రీకాంత్, శ్రీనివాస్, ఎస్ఈ శంకర్నాయక్, ఈఈలు శ్రీనివాస్, శ్రీకాంతి, డీఈ సురేశ్, రమేశ్, స్రవంతి, జలమండలి జీఎం రాజశేఖర్ , డీజీఎంలు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
జోనల్ కమిషనర్గా నియాకమమైన శంకరయ్యను విప్ గాంధీ మర్యాద పూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆయన కోరారు.
కాలనీ డివిజన్ పరిధిలో దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను కార్పొరేటర్ వెంకటేశ్తో కలిసి విప్ గాంధీ తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందన్నారు. నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్దిదారులకు ఈ పథకం కింద యూనిట్లకు ఆర్థిక సాయం అందించటం జరుగుతుందన్నారు. దళితుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు సమ్మారెడ్డి, మోజెస్, భద్రయ్య, ఇబ్రహీం, రాజేశ్, అర్జున్, అంజలి పాల్గొన్నారు.