సుల్తాన్బజార్, మే 20 : వ్యవసాయ విధానంలో రసాయనాల వాడకంతో భూమి కలుషితమవుతుందని, సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేయడం ద్వారా భూమిని కాపాడుకోవచ్చని ఇందిరా ప్రియ దర్శిని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వరలక్ష్మి అన్నారు. శుక్రవారం కళాశాలలో ఏకో ఫ్రెండ్లీ, ఈషా ఫౌండేషన్ వలంటీర్ల సంయుక్తాధ్వర్యంలో సేవ్ సాయిల్ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసిన మాట్లాడుతూ.. మట్టి ఆవశ్యకతను తెలియజేయడంతోపాటు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. సేంద్రియ విధానంతో వ్యవసాయం చేయడం ద్వారా భూమిని కాపాడుకోవడానికి అవకాశం ఉందన్నారు. ప్రతిఒక్కరూ మట్టిని రక్షించే మహా యజ్ఞంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వలంటీర్లు వీడియో ప్రదర్శనతో మట్టిని కాలుష్య కోరల నుంచి ఎలా రక్షించుకోవాలో, తిరిగి మట్టిని ఎలా సజీవంగా చేసుకోవాలో అనే అంశాలపై ఉత్తేజపరిచే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ పి.ఇందిర, యు.ఉదయశ్రీ, వేల్పుల శ్రీలత, వల్లి సౌభాగ్యంతోపాటు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.