సిటీబ్యూరో, మే 19 (నమస్తేతెలంగాణ): జవహర్నగర్ డంపుయార్డుపై ఒత్తిడిని తగ్గించేందుకు నగరశివారులో కొత్తగా రెండు వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే దుండిగల్లో సివిల్ నిర్మాణ పనులు పూర్తికాగా సెప్టెంబర్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నర్సాపూర్ మార్గంలో ప్యారానగర్ వద్ద ప్రభుత్వ భూమిలో మరో ఆధునిక వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయి. అటవీశాఖ స్థలంలో రోడ్డు నిర్మాణం ప్రతిపాదన పెండింగ్లో ఉండగా.. రెండురోజుల క్రితం అనుమతులివ్వడంతో త్వరలో రహదారి పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గ్రేటర్వ్యాప్తంగా నిత్యం 6500 టన్నుల చెత్త పోగవుతుండగా, బల్దియా జవహర్నగర్ డంపుయార్డుకు తరలిస్తున్నది. ఈ డంపు యార్డు నుంచి చెత్తను వ్యర్థాల నిర్వహణ కేంద్రాలకు తరలించి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ప్యారానగర్ కేంద్రా న్ని ఏడాదిన్నరలోపు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ కేంద్రంలో 20 మెగావాట్లు, దుండిగల్ కేంద్రంలో 15 మెగావాట్లు.. మొత్తం 35 మెగావాట్ల కరెంటును రాంకీ ఎన్వీరో సంస్థ ఉత్పత్తి చేయనుంది.