సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ )/బేగంపేట్ : తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ, రెవెన్యూ, హెచ్ఎండీఏ, దేవాదాయ, తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలు సంతోషంగా ఉండాలనే సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
పర్యాటక క్షేత్రంగా మెట్లబావి
చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని తెలిపారు. ఇందులో భాగంగా రూ.2 కోట్లతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బన్సీలాల్పేటలోని నిజాం కాలంనాటి మెట్లబావి పునరుద్ధరణ పనులను చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మెట్లబావి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న అభివృద్ధి పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. పర్యాటకుల కోసం వాకింగ్ ట్రాక్, ఫౌంటైన్, వ్యూ పాయింట్ సై వాక్, కెఫేటేరియా, బెంచీలు వంటివి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చేవారం మెట్టబావిని పరిశీలించనున్నట్లు తెలిపారు.
ఎంజీ రోడ్లో 16 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహం
ఎంజీ రోడ్డులోని గాంధీ పార్ సుందరీకరణ, మహాత్మాగాంధీ నూతన విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన పనులను అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహానికి అదనంగా 16 ఫీట్ల మహాత్మాగాంధీ నూతన విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. పార్ విస్తరణ కోసం స్థల సేకరణ, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాల తొలగింపు, ప్రస్తుతం ఉన్న నిర్మాణాల తొలగింపు తదితర పనులను ఆగస్టు 15 నాటికి పూర్తిచేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సీసీపీ దేవేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఆ స్థలాలు పేదలకే..!
నగరంలోని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన స్థలాల్లో ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న నిరుపేదలకు ఆ స్థలాలను కేటాయించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
సనత్నగర్ పరిధిలోని జీరా, సోమప్ప మఠం స్థలాల్లో ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న నిరుపేదలు ఆ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా దేవాదాయ శాఖకు చెందిన ఈ స్థలాన్ని జీహెచ్ఎంసీకి బదిలీ చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
శ్యామలకుంటలో సుమారు 330 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నాయని, జీవో 58కింద 2014లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టులో కేసు ఉన్నందున రెగ్యులరైజేషన్ చేయలేదని తెలిపారు. ఈ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని శ్యామలకుంట వాసులు కోరుతున్నారని, అవసరమైన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రాంగోపాల్పేట డివిజన్ జీరాకాలనీలో 134 ఇండ్లు ఉండగా 1994లో జీవో 816 కింద రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆ సమయంలో సుప్రీం కోర్టులో కేసు ఉండటంతో దరఖాస్తులను పెండింగ్లో పెట్టినట్లు తెలిపారు. 2002లో లబ్ధిదారులకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ జీవో 816 గడువు ముగిసినందున దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయన్నారు. జీవో 816 గడువును పొడిగించి వారికి న్యాయం చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు.