మేడ్చల్ కలెక్టరేట్, మే 19 : జిల్లాకు 2022-2023 సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికలో పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్సన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లు, అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం రూ.14,411 కోట్లతో జిల్లా రుణ ప్రణాళికను రూపొందించగా, కరోనా వంటి విపత్కర పరిస్థితులలోనూ రూ.14, 736 కోట్లతో అనుకున్న లక్ష్యానికి 102 శాతం చేరుకున్నామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికలో పరిశ్రమల రంగాలకు రూ.4865 కోట్లు, వ్యవసాయ రుణాలకు రూ.1,588 కోట్లు, విద్యారంగానికి రూ.285 కోట్లు, హౌసింగ్ రంగాలకు రూ.898కోట్లతో పాటు ప్రాధాన్యత రంగాలకు రూ.7909 కోట్ల 56 లక్షలతో రుణప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. బ్యాంకులకు వచ్చే రైతులకు, పారిశ్రామికవేత్తలకు అర్హత ఉన్నప్పటికీ పలు రుణాలు అందించడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అర్హత ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 2022-2023 సంవత్సరానికి సంబంధించిన రూ.16,373 కోట్ల వార్షిక ప్రణాళిక పుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కిశోర్కుమార్, ఆర్బీఐ ఎల్డీవో పూర్ణిమ, నాబార్డు డీడీఎం ప్రవీణ్ కుమార్, కెనరా బ్యాంక్ డీజీఎం అనంత్, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా వ్యవసాయాధికారి మేరిరేఖ, పరిశ్రమల జీఎం రవీందర్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, అధికారులు పాల్గొన్నారు.