సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్ల కేసులో సిట్ దర్యాప్తులో మరింత వేగం పెంచింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లోని పలు వర్సిటీల నుంచి నగర విద్యార్థులకు అందిన నకిలీ సర్టిఫికెట్లపై పోలీసులు కూపీలాగుతున్నారు. భోపాల్లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్సిటీ (ఎస్ఆర్కేయూ) వీసీని అరెస్ట్ చేసిన సిట్, ఇప్పుడు ఎగ్జామినేషన్ కంట్రోలర్, అడ్మిన్ విభాగాలు, రికార్డు ఇన్చార్జిలపై దృష్టి పెట్టింది. సిట్ ఆధ్వర్యంలో ఆరు బృందాలు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ముందుగా ఎస్ఆర్కేయూ విశ్వవిద్యాలయంలో పెద్ద తలకాయలను పట్టుకున్న పోలీసులు..వారి కింది నెట్వర్క్పై దృష్టి పెట్టారు.
సంతకాలు చేశారు..
ఉన్నత స్థానాల్లో ఉన్న వర్సిటీ అధికారులు ఆయా నకిలీ సర్టిఫికెట్లపై సంతకాలు చేశారు. కింది స్థాయి నుంచి ఉన్నత స్థానంలో ఉన్న వారందరూ ఈ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో భాగస్వాములయ్యారు. ఒక్కో సర్టిఫికెట్కు రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు డబ్బు వసూలు చేస్తూ తలా కొంచెం పంచుకున్నారు. ఈ పంపకాలు హైదరాబాద్ టూ భోపాల్ వరకు అన్ని స్థాయిలో ఉన్న వారికి అందాయి. దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.
మరిన్ని అరెస్ట్లు..
నకిలీ సర్టిఫికెట్లలో పాత్రధారులైన వారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తున్నది. నగరంలో నాలుగు కేసులు నమోదు చేసి.. ఆ కేసుల దర్యాప్తు బాధ్యతను సీసీఎస్ నేతృత్వంలోని సిట్కు అప్పగించారు. కన్సల్టెన్సీలు, దళారులు, యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులందరిని ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా అరెస్ట్ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలను పరిగణలోకి తీసుకొని నగరంలోని మరిన్ని కన్సల్టెన్సీలపై కూడా కేసు నమోదు చేసేందుకు అవకాశాలున్నాయి. నకిలీ సర్టిఫికెట్ల కేసులో పాత్రధారులందరిని పట్టుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.