దుండిగల్, మే 19: సభ్యసమాజం తలదించుకునేలా మృగంగా మారిన ఓ అన్న సొంత చెల్లెలిపైనే అఘాయిత్యానికి ఒడి గట్టాడు. రెండేండ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చడంతో ఈ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…కెరళకు చెందిన ఓ కుటుంబం 40 ఏండ్ల కిందట నగరానికి వచ్చి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లిలోని కాసాని కౌసల్యకాలనీలో నివాసముంటుంది. కుటుంబ యజమాని వ్యాపారి కాగా.. భార్య సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరికి ఓ కొడుకు(17), కూతురు(14) ఉన్నారు. కొడుకు స్థానికంగా ఉన్న ఇంటర్నేషనల్ పాఠశాలలో ఇంటర్ ద్వితీయసంవత్సరం చదువుతుండగా, కూతురు మరో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది.
అయితే డబుల్బెడ్ రూం ఇంట్లో నివాసముంటున్న వీరి కుటుంబానికి కరోనా శాపంగా మారింది. ఆన్లైన్ క్లాస్ల నేపథ్యంలో గడిచిన రెండేండ్లుగా దంపతులిద్దరూ రాత్రి వేళల్లో ఒక గదిలో నిద్రిస్తుండగా, అన్నాచెల్లెలు మరో గదిలో నిద్రిస్తుండేవారు. ఈ క్రమంలో బాలికను లొంగదీసుకున్న సోదరుడు తన కామ వాంఛ తీర్చుకున్నాడు. ఇలా రెండేండ్లు అఘాయిత్యానికి ఒడిగడుతూనే ఉన్నాడు. గత ఆరునెలల కిందట బాలిక రజస్యల కావడంతో ఈ నేపథ్యంలో ఇటీవల గర్భం దాల్చింది. బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లి వైద్యశాలకు తీసుకువెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దంపతులు మూడు రోజుల కిందట ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేయగా, వారి సూచన మేరకు బాచుపల్లి పోలీసులు బాలుడిపై పోక్సో కేసును నమోదు చేశారు. అనంతరం బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. బాధిత బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.