బడంగ్పేట,మే 19 : కాలనీల్లో మౌలిక వసతుల పై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ అధ్యక్షతన జరిగింది. కాలనీల్లో ఉన్న సమస్యలను కార్పొరేటర్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్, డ్రైనేజీ, మంచి నీటి సమస్య, రోడ్లు వంటి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటించి సమస్యలను గుర్తించాలన్నారు. డివిజన్ల పరిధిలో శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులు ఏ దశలో ఉన్నాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రాకముందే నాలా పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి డివిజన్లో ఉన్న శ్మశాన వాటికలు, పార్కులు, పాఠశాలలు, డంపింగ్యార్డులను కార్పొరేటర్లు దత్తతకు తీసుకొని అభివృద్ధి చేయాలని సూచించారు. మెట్రో వాటర్ లేని కాలనీల్లో సరఫరా చేయాలని మంత్రి జనరల్ మెనేజర్ను ఆదేశించారు. పైపులైన్లు లేని చోట పైపులైన్లు వేయించాలని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్ఎన్డీపీ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి : మంత్రి
గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు ఏ విధంగా విజయవంతం చేశారో అలాగే పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలకు అవసరమైన నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అభయం ఇచ్చారని ఆమె తెలిపారు. ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలను గుర్తించాలని, సమస్యను బట్టి నిధులు కేటాయిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు ఉన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు వరం..
సీఎం సహాయనిధి పేదలకు వరమని విద్యాశాఖ మంత్రి పి .సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఫరిధిలోని అల్మాస్గూడ రాజీవ్ గృహకల్పకు చెందిన పి.సంతోష్కు రూ.30వేల చెక్కు, రమేశ్కు రూ. 42 వేల చెక్కులు సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతున్నదని తెలిపారు. అనంతరం లబ్ధిదారులు మంత్రి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి, 25వ డివిజన్ కార్పొరేటర్ ముత్యాల లలితాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.