బొల్లారం,మే 19: పేద, మధ్య తరగతి,బస్తీ ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతంలో ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే లక్షల రూపాయల అధిక భారం పడుతుంది. అందుకు వీలుగా బొల్లారం పరిసర ప్రాంత ప్రజలకు గత రెండు నెలల క్రితం మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను అందుబాటులోకి తీసుకురావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు 2008 వరకు ఆరు,ఏడు వార్డులుగా విస్తరించి ఉన్నాయి. వార్డుల పునర్విభజన అనంతరం 8వ వార్డుగా మారి 15 కాలనీలు,23 బస్తీలతో సుమారు 42 వేల వరకు జనాభా కలిగి ఉంటుంది.దాదాపుగా 90 శాతం వరకు పేద,మధ్య తరగతి ప్రజలు నివసిస్తున్నారు. ఏడాదిన్నర వరకు బోర్డు సభ్యుడిగా లోక్నాథ్ ప్రాతినిధ్యం వహించారు. రిసాల బజార్ చౌరస్తాలో ఉన్న బోర్డు స్థలంలో అతిపెద్ద సామాజిక భవనం నిర్మించాలనే సంకల్పంతో 2017 లో అప్పటి ఎంపీ మల్లారెడ్డి ,ఎమ్మెల్యే సాయన్న,బోర్డు నిధుల నుంచి రూ.2కోట్ల 20 లక్షల వ్యయంతో అతిపెద్ద సామాజిక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.1800 చదరపు గజాల్లో గ్రౌండ్ ప్లస్ వన్లో నిర్మాణం చేపట్టిన ఈ భవనం దేశంలోనే అతిపెద్ద సామాజిక భవనంగా అవతరించనున్నది.ఈ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేశారు. పేద,మధ్య తరగతి కుటుంబాల్లో వివాహాలు,శుభాకార్యాల సౌలభ్యాల మేరకు గ్రౌండ్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు.దీంతో బస్తీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నామమాత్రపు ఫీజుతో…
రాష్ట్ర ప్రభుత్వం,కంటోన్మెంట్ బోర్డు సంయుక్తంగా కలిసి నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో స్థానికులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు.నామ మాత్రపు ఫీజు చెల్లించి శుభాకార్యాలు చేసుకునేందుకు రూ.5000 నిర్ణయించారు.బోర్డు అధికారులకు అందజేయాల్సి ఉంటుం ది.ఈ కమ్యూనిటీ హాల్ సుమారు 1000 మంది కెపాసిటీ కలదు.
ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చాం.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కమ్యూనిటీ హాల్ బుకింగ్ సదుపాయం కల్పించాం.బుకింగ్ చేసిన వ్యక్తి ఆన్లైన్లో రూ.14000 చెల్లించాలి.ఫంక్షన్ అయిపోయిన తర్వాత రూ.5000 తీసుకొని మిగితా నగదును తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు.
-మారుతి, సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్