అంబర్పేట, మే 19 : నల్లకుంట ఫీవర్ చౌరస్తా నాలాకు శాశ్వత పరిష్కారంగా స్లాబు నిర్మాణం చేపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి నల్లకుంట రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాద్ జిందాబాద్ ప్రతినిధులు గురువారం కమిషనర్ లోకేశ్కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నాలా సమస్య వెంటనే పరిష్కారం అయ్యేలా ఆదేశాలు ఇచ్చామని, పనులు కూడా వెంటనే ప్రారంభిస్తారని చెప్పారు. కొత్తగా ఎస్ఎన్డీపీ ప్రతిపాదిస్తున్న సగం నాలాపనులు, హెరిటేజ్ నుంచి గాంధీనగర్ లంక వరకు ఈ వానకాలం తరువాత తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఫీవర్ చౌరస్తా నుంచి రామాలయం క్రాస్ రోడ్డు వరకు నాలా పై స్లాబ్ పనులు వెంటనే ప్రారంభించాలని, ఓల్డ్ నల్లకుంట, పాత రామాలయం, పరిసర ప్రాంతాల్లోని ఇండ్లు వరదకు మునగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కమిషనర్ను కోరారు. కమిషనర్ను కలిసిన అనంతరం ఇంజినీరింగ్ విభాగం ఈఈ శంకర్, డీఈ సువర్ణ, ఏఈ విఘ్నేశ్వరి తదితరులు నల్లకుంట వీధి నంబర్ 15, పాత రామాలయం లేన్, ఫీవర్ చౌరస్తా నాలాను స్వయంగా పరిశీలించారు. శుక్రవారం నుంచి నాలా క్లీనింగ్ పనులు ప్రారంభిస్తామని, వారంలోగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కమిషనర్ను కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్రావు, అడ్వైజర్లు డా.జయసూర్య, రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి మోహన్నాయుడు, హైదరాబాద్ జిందాబాద్ కార్యదర్శి వీరయ్య, నాయకులు శ్రీనివాస్రావు, అజయ్రెడ్డి, రితేశ్, అశ్విన్ పాల్గొన్నారు.