అంబర్పేట, మే 19 : అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ను కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మొదలు పెట్టనున్న , పురోగతిలో ఉన్న పనులు, ఇతర పనులపై చర్చించారు. ప్రధానంగా వర్షపు నీటి నాలాల అభివృద్ధి, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో చేపట్టవలసిన చర్యలను అధికారులను వివరించారు. ఎన్ఎన్డీపీ కింద మొదలైన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ను ఆనుకొని ఉన్న హుస్సేన్సాగర్ నాలాకు ప్రహరీ, రత్నానగర్ రిటైనింగ్ వాల్, ఓల్డ్ రామాలయం వద్ద వరద ముంపునకు గురికాకుండా ఉండేందుకు నాలా అభివృద్ధి, మొయిన్ చెరువు నాలా పనుల విషయమై చర్చించారు. నియోజకవర్గంలోని బర్కత్పుర, అలీకేఫ్, నారాయణగూడ వైఎంసీఏ జంక్షన్ల అభివృద్ధి పై చర్చించి పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. అన్ని పార్కులను అభివృద్ధి పరిచే ప్రణాళికను త్వరగా అమలు చేయాలన్నారు.
ఫీవర్ దవాఖాన, శివం రోడ్డులో ఏసీ బస్ షెల్టర్ల నిర్మాణం, విఘ్నాన్పురి కాలనీలో మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ముస్లిం గ్రేవ్ యార్డుకు జలమండలి కేటాయించిన మూడెకరాల స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. అర్రాస్పెంట, మొయిన్ చెరువు హిందూ శ్మశాన వాటికల్లో కన్సల్టెన్సీని నియమించి అభివృద్ధి పనులను మొదలు పెట్టాలని , డీ మార్ట్ దగ్గర చేపట్టిన నాలా విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. దీనికి స్పందించిన కమిషనర్ అన్ని పనులను త్వరలోనే చేపడతామని ఎమ్మెల్యేకు చెప్పారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్, హార్టికల్చర్ అడిషనల్ కమిషనర్ కృష్ణ, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ అనిల్రాజు పాల్గొన్నారు.