కేపీచ్బీ కాలనీ, మే 19 : స్వచ్ఛమైన నీటితో కళకళలాడాల్సిన చెరువులలో గుర్రపుడెక్క పేరుకపోవడంతో పాటు మురుగునీరు చేరుతుండడంతో చెరువు పరిసరాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. చెరువు నీటిలో గుర్రపుడెక్క, మురుగునీటిని ఆవాసంగా చేసుకుని దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ సమస్యపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని చెరువులన్నింటినీ సుందరీకరించే పనులను ప్రారంభించింది. దీనిలో చెరువులలో మురుగునీటిని శుద్ధి చేసేందుకు ఎఫ్టీపీలను ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు. అలాగే చెరువులలో పెరుకుపోయిన గుర్రపుడెక్కను ఎప్పటికప్పుడు తొలగించే పనులను చేపట్టారు. ఇప్పటికే ప్రైవెట్ ఏజేన్సీతో చెరువులలో గుర్రపుడెక్కను తొలగించే పనులు చేపట్టగా.. తాజాగా ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ (ఎఫ్టీసీ) యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు జోన్లలో…జోన్కు ఒకటి చొప్పున ఎఫ్టీసీ యంత్రాలను కేటాయించగా.. ఈ యంత్రం సహాయంతో కూకట్పల్లి జోన్లోని పలు చెరువులలో గుర్రపుడెక్క, ప్లాస్టిక్ బాటిళ్లను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు.
తొలుత ఏడు చెరువులలో..
కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లలో 41 చెరువులు ఉన్నాయి. గతంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం చెరువులలో ప్రతియేటా మనుషుల సహాయంతో గుర్రపుడెక్కను తొలగించినా సత్ఫలితాలు సాధించలేకపోయింది. రెండేండ్ల క్రితం జోన్ పరిధిలోని తోమ్మిది చెరువులలో గుర్రపుడెక్కను తొలగించే పనులను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. దీనిలో భాగంగా ఎంపిక చేసిన చెరువులలో గుర్రపుడెక్కను తొలగించే పనులు యేడాదంతా సాగుతున్నాయి. తాజాగా ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ యంత్రంతో సర్కిళ్ల వారీగా మిగిలిన చెరువులలో గుర్రపుడెక్కను తొలగించే పనులను చేయనున్నారు. తొలుత జోన్ పరిధిలో ఏడు చెరువులను ఎంపిక చేశారు. మూసాపేట సర్కిల్లోని రంగధాముని (ఐడీఎల్) చెరువు, కూకట్పల్లి సర్కిల్లోని ఎల్లమ్మచెరువు, భీమునికుంట, నల్లచెరువు, కుత్బుల్లాపూర్ సర్కిల్లోని వెన్నెలగడ్డ చెరువు, గాజులరామారం సర్కిల్లోని లింగాలచెరువు, అల్వాల్ సర్కిల్లోని చెన్నరాయుడి చెరువులు ఉన్నాయి. ఈ చెరువులలో గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎఫ్టీసీ యంత్రం సహాయంతో తొలగించే పనులు మొదలయ్యాయి. ఇప్పటికే చెన్నరాయుడు, వెన్నెలగడ్డ చెరువులలో గుర్రపుడెక్కను తొలగించే పనులు పూర్తికాగా ప్రస్తుతం రంగధాముని చెరువులో పనులు కొనసాగుతున్నాయి.
చెరువులన్నీ పరిశుభ్రం..
చెరువులలో గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కూకట్పల్లి జోన్లో 9 చెరువులను ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. మూడు సంవత్సరాల పాటు ఆ చెరువులలో వ్యర్థాలను తొలగించే బాధ్యత ఏజెన్సీదే. కొత్తగా ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ యంత్రం సహాయంతో మరో ఏడు చెరువులలో గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నాం. గుర్రపుడెక్క వ్యర్థాలను తొలగించడం వల్ల దోమలను నియంత్రించడంతో పాటు చెరువు పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. చెరువులు, కాలువలలో వ్యర్థాలు వేయొద్దని ప్రజలను వేడుకుంటున్నాం.
– లచ్చిరెడ్డి, సీనియర్ ఎంటమాలజిస్ట్,కూకట్పల్లి జోన్