కుత్బుల్లాపూర్,మే19: పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారనిఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ సహాయనిధి నుంచి మంజూరైన రూ.19 లక్షలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను 23 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి బాటలు వేస్తుందన్నారు. వేలాది మంది పేద,మధ్య తరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారికి భరోసాను అందిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
132 జీడిమెట్ల డివిజన్ గాయత్రినగర్కు చెందిన బి.ధీరజ్ ఇటీవలే జరిగిన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్(ఎన్టిఎస్ఈ) స్టేజ్-2లో ఉత్తమ ప్రతిభను కనబర్చి విజయం సాధించిన సందర్భంగా విద్యార్థినిని శాలువాతో సత్కరించి అభినందించారు.కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు బి.జవాజి, పద్మ, కాలనీవాసులు మహేందర్సింగ్, అచ్చుత వర్ధన్, పైలెట్ జార్జ్, కాలే నాగేశ్ పాల్గొన్నారు.
125 గాజులరామారం డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో రూ.9 లక్షలతో తాగునీటి పైపులైన్, రూ.12లక్షలతో భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేసిన సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న సీసీరోడ్డు పనులను పూర్తి చేసేలా కృషి చేయాలని కోరారు.
126 జగద్గిరిగుట్ట అంజయ్యనగర్, 129 సూరారం డివిజన్ మోతినగర్ కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కృషి చేయాలని కోరుతూ ఆయా కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్లో ఈనెల 26న జరిగే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, ధ్వజ సహిత విఘ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు.