పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల కాన్పు అంటే తల్లిదండ్రులకు ఆర్థికభారం. ప్రైవేట్కెళితే టెస్ట్లు, ఇతర ఖర్చులు తడిసిమోపెడవుతాయి. సాధారణ ప్రసవానికి అవకాశమున్నా కాసుల కోసం సిజేరియన్ చేసి వేలల్లో గుంజుతుంటారు. దీన్ని అరికట్టడంతోపాటు సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మెరుగుపడిన వసతులు, సుశిక్షుతులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడంతో కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో కాన్పుల సంఖ్య అమాంతం పెరిగింది. గతంలో నెలకు 20 ప్రసవాలు జరిగేవి. ఇప్పుడా సంఖ్య 230కి చేరాయి. అంటే పదింతల ప్రసవాలు పెరగడం విజయంగా చెప్పొచ్చు. గత నాలుగునెలల్లో 990 కాన్పులు జరిగితే.. ఇందులో 559 సాధారణ ప్రసవాలు జరగడం మరో విశేషం. కేసీఆర్ కిట్లు, తల్లీబిడ్డకు కలుగుతున్న లబ్ధితో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డను ప్రత్యేక వాహనంలో ఉచితంగా ఇంటికి చేరవేస్తున్నారు.
కొండాపూర్, మే 17: మెరుగుపడిన వసతులు..నిత్యం అందుబాటులో వైద్యులు, సిబ్బంది..కార్పొరేట్ తరహాలో సౌకర్యాలతో ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అవుట్ పేషెంట్(ఓపీ)తో ఇన్పేషెంట్(ఐపీ) విభాగాల్లో నిత్యం రద్దీ నెలకొంటున్నది. ఒకప్పుడు కాన్పులు అంటే ప్రైవేటుకెళ్లే మహిళలు..ఇపుడు ప్రభుత్వ దవాఖానల్లో చేరుతున్నారు. కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో గతంలో నెలకు 20 నుంచి 30 కాన్పులయ్యేవి. ప్రస్తుతం నెలకు 230కి పైగా కాన్పులవుతున్నాయంటే సాధారణ విషయం కాదు. గత నాలుగునెలల్లో 990 కాన్పులు జరిగితే..ఇందులో 559 మందికి సాధారణ ప్రసవాలు చేశారు. మిగతా వారికి సాధారణ ప్రసవాల కోసం యత్నించినప్పటికీ తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శస్త్రచికిత్సలు నిర్వహించారు. గతంలో 45 శాతం ఉన్న సిజేరియన్లు..ప్రస్తుతం 30 శాతానికి తగ్గినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వరదాచారి వెల్లడించారు. జిల్లా దవాఖానలో రంగారెడ్డి జిల్లాతోపాటు వికారాబాద్, మహబూబ్నగర్, మేడ్చల్ జిల్లా, ఇతర రాష్ర్టాల నుంచి వలసొచ్చిన వారు వైద్యసేవలను వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.
కేసీఆర్ కిట్లతో మేలు
గతంలో కొండాపూర్లోని జిల్లా దవాఖానలో నెలకు 20 కాన్పులయితే మహా ఎక్కువ. ప్రస్తుతం అందిస్తున్న మెరుగైన వైద్య సేవలతోపాటు కేసీఆర్ కిట్లు, తల్లీబిడ్డలకు అందుతున్న లబ్ధితో దవాఖానలో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. డెలివరీ అనంతరం ఇంటికి చేరేందుకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు.
వైద్య సేవలు బాగున్నాయి
న్యూహఫీజ్పేట నుంచి డెలివరీ కోసం వచ్చాను. ప్రైవేట్ దవాఖానలో రూ.50 వేల నుంచి రూ.70 వేల ఖర్చవుతుందన్నారు. ఇక్కడ రూపాయి తీసుకోకుండా కాన్పు చేయడంతోపాటు డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. ప్రైవేట్కుపోతే మేమే డబ్బులు కట్టాల్సి వచ్చేది. కానీ ఇక్కడ ప్రభుత్వమే డబ్బులిస్తూ వైద్యమందిస్తున్నది.
– రెబెకా, న్యూహఫీజ్పేట
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం
కొండాపూర్ జిల్లా దవాఖానలో నిపుణులైన వైద్యులు ఉన్నారు. గైనకాలజీ విభాగంలో అత్యవసరమైతేనే సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నాం. మెరుగైన వైద్యమందించేందుకు కృషి చేస్తున్నాం.
– డాక్టర్ వరదాచారి, రంగారెడ్డి , జిల్లా దవాఖాన సూపరింటెండెంట్