ఘట్కేసర్, జనవరి18 : పోచారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. హెచ్ఎండీఏ అధికారులు ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్,పోచారం కమిషనర్ సురేశ్, పోలీసులు కలిసి జేసీబీ సహాయంతో పోచారం గ్రామంలోని మూడు ప్రాంతాల్లో అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేశారు. గ్రామకంఠం, ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా పక్కా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పోచారం మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ నుంచి అనుమతులు పొందిన తరువాత నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్ సురేశ్ సూచించారు. మేనేజర్ నర్సింహులు, పోలీసులు, సిబ్బంది, పాల్గొన్నారు.
జవహర్నగర్ కార్పొరేషన్లో..
జవహర్నగర్ : జవహర్నగర్లోని అక్రమ నిర్మాణాలపై కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కార్పొరేషన్ కమిషనర్ జ్యోతిరెడ్డి నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ టీం , మున్సిపల్ సిబ్బంది కలిసి కార్పొరేషన్లోని అక్రమ అంతస్తుల నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ గ్రామకంఠం పరిధిలో నూతనంగా ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని ఎన్నిసార్లు హెచ్చరించిన పట్టించుకోవడం లేదన్నారు. చాలా మంది యజమానులకు నోటీసులు ఇచ్చామని, త్వరలో వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.సీఐ కె.చంద్రశేఖర్, ఎస్సైలు సాయిలు, మోహన్, శివప్రసాద్, టీపీఎస్ శ్రీనివాస్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.