ఖమ్మం ఎడ్యుకేషన్/ఖమ్మం వ్యవసాయం, మే 13 : సిలబస్పై అవగాహన పెంచుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సబ్జెక్టుపై పట్టు సాధిస్తే కొలువును సులువుగా సాధించి విజేతలుగా నిలుస్తారని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత పేర్కొన్నారు. ఉద్యోగం సాధించాలనే కోరిక ఉంటే సరిపోదని, అందుకు తగ్గట్లుగా ప్రణాళిక, పట్టుదల ఉండాలని, అప్పుడే కల సాకరమవుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ‘ఏం చదవాలి? ఎలా చదవాలి? భయాన్ని ఎలా తొలగించుకోవాలి?’ అనే అంశాలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, రైట్ చాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం పోటీ పరీక్షల ఉచిత అవగాహన సదస్సు జరిగింది. అతిథులు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలలత ప్రధాన వక్తగా మాట్లాడుతూ.. అభ్యర్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పట్టు సాధించాలని సూచించారు.
విశేష స్పందన..
సదస్సుకు ఉదయం 9 గంటలకే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వందల కిలోమీటర్ల నుంచి సదస్సుకు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. హాల్ సామర్థ్యం వెయ్యి మంది కాగా.. సుమారు 1500 మందికిపైగా రావడంతో విశేష స్పందన లభించింది. నమస్తే తెలంగాణ ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, ఎడిషన్ ఇన్చార్జి కాయల పూర్ణచందర్, యాడ్స్ మేనేజర్ బోయిన్ శేఖర్, కార్పొరేటర్ విజయ, నమస్తే తెలంగాణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘తెలంగాణ ఉద్యమ చరిత్ర’ పుస్తకావిష్కణ..
60 ఏళ్లుగా ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలు, కేసీఆర్ దీక్ష, ఉద్యమరూపాలు వంటి అంశాలను విశదీకరిస్తూ.. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడేందుకు వీలుగా ‘నమస్తే తెలంగాణ’ ‘నిపుణ’ రూపొందించిన ‘తెలంగాణ ఉద్యమ చరిత్ర’, ‘భారతదేశ చరిత్ర – ప్రశ్నల నిధి’ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు.
సామాజిక బాధ్యతతో సదస్సు నిర్వహణ..
ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లలో పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ‘నిపుణ’ పేరుతో నిపుణుల అభిప్రాయాలను, మెటీరియల్ను అందిస్తున్నాం. అంతటితో ఆగకుండా రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలనే తలంపుతో సామాజిక బాధ్యతను తీసుకున్నాం. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉండే సందేహాలు తీర్చేందుకు, అనుమానాలు నివృత్తి చేసేందుకు జిల్లాల్లో ఉచిత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గతంలో ఇంటర్నెట్ వంటివి లేక విషయ సమాచారం తక్కువగా ఉండేది. ఇప్పటి జనరేషన్ అభ్యర్థులు చాలా అదృష్టవంతులు. అన్ని అరచేతిలోనే ఉన్నాయి. ఇలాంటి సదస్సుల్లో నిపుణులు చెప్పే విషయాలు నోట్ చేసుకొని సన్నద్ధమవ్వాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లా యువతీ యువకులే ఎక్కువగా ఉద్యోగాలు సాధించాలి.
-ఎస్జీవీ శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ నెట్వర్క్ ఇన్చార్జి
మా అకాడమీ నుంచి 1,200 మందికి ఉద్యోగాలు..
మా వద్ద పొందిన శిక్షణ వల్ల జిల్లా నుంచి 1,200 మందికి ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ వంటి ఉద్యోగాలు లభించాయి. పోటీ పరీక్షలకు ప్రత్యక్ష శిక్షణతోపాటు ఆన్లైన్ శిక్షణ కోసం లెజెండరీ ఫ్యాకల్టీతో ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ను అందుబాటులో తీసుకొచ్చాం. కరోనా సమయంలో ఎందరో అభ్యర్థులు వీటిని వినియోగించుకొని ఇంటి వద్దనే సన్నద్ధమయ్యారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో 20 ఏళ్లుగా లక్షలాది మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన అపార అనుభవం ఉన్న సివిల్స్, గ్రూప్స్ ఫ్యాకల్టీ పాఠాలు ఆర్సీ ఎగ్జామ్స్ యాప్లో ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా ఆడియో, వీడియో స్పష్టంగా ఉండేలా 4కే వీడియో క్లాస్లు అందిస్తున్నాం. విద్యార్థుల్లో సందేహాల నివృత్తి కోసం ఫ్యాకల్టీతోనే లైవ్ సెషన్స్ ఏర్పాటు చేశాం. ప్రాక్టీస్ కోసం 25 వేల ప్రామాణిక ప్రశ్నలతో యాప్లో బిట్ బ్యాంక్ను అందిస్తున్నాం. జిల్లా నుంచి ఈ దఫా 50 మంది గ్రూప్-1, మరో 300 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
-మెండెం కిరణ్కుమార్, రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్
కఠిన శ్రమే విజయానికి మంత్రం..
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. సివిల్స్ మొదలుకుని గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల వరకూ ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలనే కల ఉంటుంది. ఆ కలను, ఆ ఆశను నిజం చేసుకోవాలంటే దగ్గరి దారులు ఏమీ ఉండవు. కఠిన శ్రమే విజయానికి మంత్రం. సక్సెస్ ఎక్కడో ఉండదు. మనలోనే ఉంటుంది. మనోబలంతోనే దానిని సాధించాలి. రాష్ట్ర ప్రభుత్వం భారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వాటిల్లో విజయం సాధించాలంటే ఎలా చదవాలో ఒక ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ ఆర్థిక విషయాలు, భౌగోళిక అంశాలు, సామాజిక స్ధితిగతులు, తెలంగాణ ఉద్యమం వంటి వాటి గురించి తెలిసి ఉండాలి. వాటి గురించి లోతుగా అధ్యయనం చేయాలి. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో పోటీ పడే అభ్యర్థులు రాష్ర్టానికి చెందిన అంశాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టాలి. -మల్లవరపు బాలలత, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్
కసి ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..
నిరంతర శ్రమ, చిత్తశుద్ధితోపాటు సాధించాలన్న కసితో ముందుకు సాగితేనే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులందరూ ప్రతి అంశాన్నీ విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలలి. విద్యార్థులంతా భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సూర్యుడు ఉదయించడం కంటే ఎవరు ముందు నిద్రలేస్తారో వారే విజయం సాధిస్తారు. అభ్యర్థులు ఈ విషయాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలి. ఓటమి గురించి ఆలోచించకుండా నిరంతరం గెలుపు నామస్మరణ చేయాలి. నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ముఖ్యం కాదు. అందులో ఒక పోస్టు తనదేనన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సంకల్పబలం ఉంటే ఉద్యోగం సలాం కొడుతుంది. ప్రభుత్వం వెలువరిస్తున్న నోటిఫికేషన్లతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలంటే అందుకు శిక్షణ కూడా ఎంతో అవసరం.
-గంపా నాగేశ్వరరావు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు
నేనూ మీ నుంచే వచ్చా..
నేనూ మీ నుంచే వచ్చా. ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేరయ్యా. రాత పరీక్ష ఉత్తీర్ణుడినయ్యా. ఫిజికల్గా ఫిట్గా లేనన్నారు. ఆరో ప్రయత్నంలో సివిల్స్ సాధించా. ఐపీఎస్ శిక్షణలో అన్ని రకాల మెడల్స్ సొంతం చేసుకున్నా. నేను ఎంత ఫిట్గా ఉన్నానో అనేందుకు ఇదే ఉదాహరణ. అంత కసిగా ఉండాలి. అపజయాల నుంచి విజయాలు సాధించాలి. కొందరికి త్వరగా సక్సెస్ వస్తుంది. కొందరికి ఆలస్యంగా వస్తుంది. కానీ ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ముందుగా సిలబస్ను సిద్ధం చేసుకుని మనతో పోటీ పడేవారికి అనుగుణంగా సన్నద్ధమవ్వాలి. ప్రతి సబ్జెక్టుకూ ఎంత టైమ్ పడుతుందో అంచనా వేసుకోవాలి. అవగాహన లేని సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి. నాలుగు అంశాలపై దృష్టి పెడితే విజయం వరిస్తుంది. మొదటిది స్టడీ ప్లాన్.. షెడ్యూల్ ప్రకారం చదవాలి. రెండోది మెటీరియల్. మార్కెట్లో చాలా స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి. మంచి మెటీరియల్ను ఎంపిక చేసుకొని చాలాసార్లు వాటినే చదవాలి. మూడోది స్టడీ గ్రూప్.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే మిత్రులతో గ్రూప్ క్రియేట్ చేసి నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. నాలుగోది ఆరోగ్యం.. చదవడంతోపాటు ఆరోగ్యం చాలా ముఖ్యం. కంటిన్యూగా 16 గంటలు చదవొద్దు. ఆహారం, వ్యాయామం అన్నింటికీ ప్రాధాన్యం ఇస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ప్రిపరేషన్ను కొనసాగించగలుగుతారు.
-సిరిశెట్టి సంకీర్త్, ఖమ్మం ఏఎస్పీ
వక్తల ప్రసంగాలకు విశేష స్పందన
సదస్సులో వక్తల ప్రసంగాలకు విశేష స్పందన లభించింది. హాజరైన నిరుద్యోగులకు నిర్వాహకులు నమోదు పత్రాలను అందజేశారు. నిపుణుల అభిప్రాయాలతో వస్తున్న పేజీలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సదస్సుకు వచ్చిన అభ్యర్థులు వీటిని ఆసక్తిగా తిలకించారు. వక్తల ప్రసంగాలను అభ్యర్థులు స్మార్ట్ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. ఆసక్తిగా నోట్ చేసుకున్నారు. సాయంత్రం 3:30 గంటల వరకు సదస్సు కొనసాగింది. నిపుణుల విజయగాథలను వీడియో రూపంలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు అభ్యర్థుల కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మార్మోగింది. వీడియోలు, నిపుణుల ప్రసంగాలు నిరుద్యోగుల్లో నూతనోత్సాహాన్ని, స్ఫూర్తిని నింపాయి.
హ్యాండ్ బుక్ అందజేత..
‘కొలువు సులువుగా గెలువు’ అనే 48 పేజీలతో కూడిన హ్యాండ్ బుక్ను సదస్సుకు హాజరైన అభ్యర్థులకు ఉచితంగా అందజేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డిల ఇంటర్వ్యూలు, జిల్లాల వారీగా ఖాళీలు, గ్రూప్స్ పరీక్షల విధానం, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఏముంటాయి? ఏ ఉద్యోగానికి ఎవరు పోటీపడాలి? అనే అంశాలను బుక్లో స్పష్టంగా పొందరుపర్చారు.
ఆత్మవిశ్వాసంతోనే సాధించగలరు..
సబ్జెక్టును చదవడంలో చాలామందికి ఆత్మవిశ్వాసం ఉండదు. ఆత్మన్యూనత నుంచి ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి కృషిచేయాలి. మీరు పడే కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇన్ని వేల ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం సాధించడం ఖాయం. అకాడమీ పరీక్షలకు, పోటీ పరీక్షలకు చాలా తేడా ఉంటుంది. అకాడమీ పరీక్షల్లో అర మార్కును చూసీ చూడనట్లు వేస్తారు. కానీ.. పోటీ పరీక్షలో ఎక్కడ అర మార్కు తప్పు చేశాడో అని చూసి కొట్టి పడేస్తారు. సక్సెస్ కోసం బ్లూప్రింట్ అవసరం. ప్రతి ఒక్కరూ బ్లూప్రింట్ స్ట్రాటజీని తయారు చేసుకోవాలి. ప్రిపరేషన్ కోసం నాలెడ్జ్, స్కిల్స్తోపాటు ఫిజికల్గా సంసిద్ధులై ఉండాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. ఈ ఉద్యోగం నేను సాధిస్తానన్న నమ్మకం గట్టిగా ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకున్నప్పడు, చదివినప్పుడు కొంత సమయం మాత్రమే గుర్తుంటాయి. మరిచిపోకుండా ఉండాలంటే చదివిన విషయాలు నోట్ చేసుకోవాలి. ప్రతి విషయాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఒక స్క్రిప్ట్ ప్రకారం మననం చేయాలి. నిద్ర నుంచి లేచిన తర్వాత చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. చదివిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకోవాలి. లక్ష్యం పెట్టుకుని సాధన చేయాలి. అప్పుడే ఉద్యోగం సాధించగలరు.
-డాక్టర్ సీఎస్ వేప, వేప అకాడమీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్
ప్రతి రోజూ తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి..
పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కృషి, పట్టుదల, శ్రద్ధ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటే వారు మిమ్మల్ని చదివించడానికి పడిన కష్టం గుర్తుకొస్తుంది. ఓటమి పాలైనప్పుడు ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు వస్తాయి. వాటని చూసి నిరుత్సాహ పడొద్దు. ప్రతిసారీ ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే విజయం వరిస్తుంది. విజయం వచ్చినప్పుడు.. అప్పటి వరకూ పడిన శ్రమను, కష్టాన్ని మర్చిపోతాం. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడం మన బాధ్యత. లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రమించాలి. ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్లలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటున్నా. మీ సన్నద్ధానికి నా వంతు సహకారం అందిస్తా.
-మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి