మేడ్చల్, మే 13(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, సకల సౌకర్యాలు కల్పించి ప్రేవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే ప్రణాళిక అమలవుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన 144 పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ.70 కోట్ల నిధులను వెచ్చించనుంది. మంజూరైన నిధులతో 12 ఆంశాల్లో వివిధ రకాల సౌకర్యాలను కల్పించనున్నారు. మరో 32 పాఠశాలల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
నిధుల అంచనా పెరిగినా.. ప్రభుత్వం సిద్ధం
పాఠశాలల అభివృద్ధి పనులలో నిధుల అంచనాలు పెరిగినా మరిన్ని నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రూ.70 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికి అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయనుంది. అలాగే, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యులు కావాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎంపికైన పాఠశాలల్లో త్వరలో పనులు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులను ప్రారంభించనున్నాం. మరో 32 పాఠశాలల అభివృద్ధికి నిధుల మంజూరుకు టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నది. రూ.30 లక్షల పైచిలుకు నిధులు అవసరం ఉన్న పాఠశాలల పనులకు టెండర్లను ఆహ్వానించనున్నాం. ఈ నెలాఖరు వరకు టెండర్ ప్రక్రియ పూర్తి కానుంది.
– విజయ కుమారి, విద్యాధికారి, మేడ్చల్-మల్కాజిగిరి