సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ): సర్కార్ దవాఖానల్లో రోగి సహాయకుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5/-ల భోజనాన్ని సంతోషంగా స్వీకరిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఒక అవ్వ ఫొటోను మంత్రి హరీశ్ రావు శుక్రవారం తన ట్విట్టర్లో షేర్ చేశారు. సర్కార్ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5భోజనం ఓ వరం అంటూ ట్వీట్ చేశారు.
భోజనామృతానికి విశేష స్పందన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోగి సహాయకుల కోసం నగరంలోని 18 దవాఖానాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూ.5/-లకే కడుపు నిండా భోజనానికి రెండో రోజు మంచి స్పందన లభించింది. ప్రతి రోజు 19 వేల నుంచి 20 వేల మందికి నగరంలోని 18 దవాఖానల్లో అందించాలని అధికారులు అంచనా వేసి, ఆ క్రమంలో ప్రణాళికను రూపొందించారు. ఈ పథకం ప్రారంభం రోజే రోగి సహాయకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో నగరంలోని దవాఖానాల్లో రెండో రోజు కూడా ఐదు రూపాయల భోజనానికి విశేష స్పందన లభించింది. ఉస్మానియా దవాఖానలో ఉదయం 300 మంది అల్పాహారం తీసుకోగా, మధ్యాహ్నం 600 మంది భోజనం చేశారని, రాత్రి 8 గంటల వరకు 300 మంది డిన్నర్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిలోఫర్, ఎంఎన్జే, గాంధీ, పేట్ల బుర్జ్, సుల్తాన్ బజార్ ప్రసూతి దవాఖానల్లో సైతం రెండో రోజు ఒక్కో దవాఖానలో మూడు పూటలు కలిపి సుమారు వెయ్యిమంది వరకు భోజనం చేసినట్లు అధికారులు తెలిపారు.