బన్సీలాల్పేట్, జనవరి 17 : బస్తీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం బన్సీలాల్పేట్ డివిజన్లోని రామస్వామి కాంపౌండ్ బస్తీలోని శ్రీజగదాంబ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ శివకుమార్ లాల్, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, సంయుక్త కార్యదర్శి జేపీ రాజు, ఆర్గనైజర్లు అభిమాన్, డానియెల్లు మారెడ్పల్లిలోని నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తమ బస్తీలో నెలకొన్న కమ్యూనిటీ హాలు నిర్మాణం, పార్కు ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు, నీటి కోసం సింటెక్స్ ట్యాంకులకు మరమ్మతులు చేయించడంపై వారు మంత్రికి వినతి పత్రం అందజేశారు. తాను త్వరలో రామస్వామి కాంపౌండ్ బస్తీని సందర్శిస్తానని మంత్రి అన్నారు. అనంతరం బస్తీ నూతన కమిటీ నాయకులు బన్సీలాల్పేట్ కార్పొరేటర్ హేమలత నివాసానికి వెళ్లి ఆమెను కూడా కలిశారు. తమ బస్తీ సమస్యల గురించి వివరించారు. గాంధీ నగర్ పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్ మోహన్రావును, సెక్టార్ ఎస్ఐలను కలిసి శాంతి భద్రతల పరిరక్షణలో నూతన కమిటీ పూర్తిగా సహకారం అందిస్తుందని తెలిపినట్టు అధ్యక్షుడు డాక్టర్ శివకుమార్ లాల్ తెలిపారు. గతంలో తాను 8 ఏండ్లపాటు బస్తీ అధ్యక్షుడిగా పనిచేశానని, మరోసారి తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన బస్తీప్రజలకు ఆయన ధన్య వాదాలు తెలిపారు. బస్తీ అభివృద్ధికి ఐకమత్యంగా కలసిమెలసి పనిచేస్తామని తెలిపారు.