మారేడ్పల్లి, మే 13:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది దక్షిణ మధ్య రైల్వేకు కీలకమైన స్టేషన్. నిత్యం వందల సంఖ్యల్లో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్షలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి వివిధ రాష్ర్టాలు, జిల్లాలకు వచ్చిపోతుంటారు. దీంతో నిత్యం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ రహదారులు రద్దీగా ఉంటాయి. ప్రతి రోజూ రెతిఫైల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డు, సికిం ద్రాబాద్ క్లాక్టవర్ మీదుగా వాహనదారులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో రెతిఫైల్ బస్టాండ్ టెర్మినల్, , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్సు టెర్మినల్, గురుద్వారా బస్సు టెర్మినల్ ముఖ్య మూడు బస్టాండ్లు ఇక్కడ ఉన్నాయి. రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న ప్రయాణికులు…ఈ ప్రాంతంలో ఉన్న బస్సు టెర్మినల్ వద్ద నుంచి బస్సుల ద్వారా వారి వారి ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో ఈ రహదారులన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. ఈ సమస్య పరిష్కారానికి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలుపడంతో పలువురు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిన రోడ్లు ఇవే..
సికింద్రాబాద్ రైల్వే పరిసర ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధాననమైనవి రెతిఫైల్ నుంచి అల్పా హోటల్ వరకు 36 మీటర్ల రోడ్డు వెడల్పు, అల్పా నుంచి పాత గాంధీ ఆసుపత్రి వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పు, పాత గాంధీ ఆసుపత్రి నుంచి వయా మోండా మార్కెట్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల వరకు జీహెచ్ఎంసీ రోడ్ల విసర్తణకు ఆమోదం తెలిపింది.