ఖైరతాబాద్, మే 13: నిత్యం లక్షలాది వాహనాలు…వేలాది మంది నడకలు….ట్రాఫిక్ చిక్కులు….ఇలా పంజాగుట్ట జంక్షన్ నలు దిక్కుల నుంచి వెహికిల్స్, పాదచారులతో నిండు కుండలా కనిపించేది. ఇక్కడ రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సింది. ట్రాఫిక్ పోలీసులు, సిగ్నలింగ్ వ్యవస్థ చక్కగా ఉన్నప్పటికీ కొందరి నిర్లక్ష్యపు, ర్యాష్ డ్రైవింగ్లో రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీకొట్టగా అనేక ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయి. ఈ సమస్యలన్నింటికీ ప్రభుత్వం చెక్ పెడుతూ నగర వ్యాప్తంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఫలితంగా పాదచారులకు ప్రమాదాలు తప్పాయి. –
ప్రధాన కూడలిలో ప్రశాంతంగా
పంజాగుట్ట ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఏడాదిన్నర క్రితం ప్రారంభమైంది. ఇక్కడ అమీర్పేట-ఖైరతాబాద్, సికింద్రాబాద్-మెహిదీపట్నం రూట్లలో నిత్యం వేల సంఖ్యల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పోలీస్ స్టేషన్లు, నిమ్స్ దవాఖాన, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు సైతం ఉండటంతో నగరంతో పాటు రాష్ట్ర నలుమూలలు, ఇతర రాష్ర్టాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు, సందర్శకులు వచ్చిపోతుంటారు. పంజాగుట్ట ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్లో ప్రధానంగా ట్రాఫిక్ చిక్కులు ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఎఫ్వోబీను వినియోగించుకుంటూ ప్రశాంతంగా రోడ్డు దాటుతున్నారు.
రూ.5 కోట్లతో ఆధునిక హంగులు.
పంజాగుట్ట ఎఫ్వోబీని రూ.5 కోట్లతో నిర్మాణం చేపట్టారు. నిర్మాణం మొత్తం మైల్డ్ సీల్తో చేపట్టారు. బ్రిడ్జికి మధ్యలో గ్లాస్ ఫిటింగ్స్, లువర్స్, రేయిలింగ్స్తో పాటు రెండు ఎక్సలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. పాదచారుల సురక్షిత ప్రయాణానికి సీసీ కెమెరాలను అమర్చారు.
తీరిన ట్రాఫిక్ కష్టాలు
పంజాగుట్ట చౌరస్తాలో రోడ్డు దాటాలంటే ఇబ్బందిగా ఉండేది. వేగంగా వాహనాలు వస్తుండటంతో భయమేసేది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో మా ప్రయాణం సులువుగా మారింది.
కె. లక్ష్మి, బీఎస్ మక్తా
సులువుగా దాటుతున్నాం
ఒకప్పుడు ఇక్కడ రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చేది. హైదరాబాద్ సెంట్రల్ మాల్ నుంచి అవతలివైపు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కట్టిన తర్వాత సాఫీగా రోడ్డు దాటుతున్నాను.
– ఈ. జ్యోతి, బీఎస్ మక్తా