శేరిలింగంపల్లి, మే 13: పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, అధునాతన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఉచిత డయాగ్నోస్టిక్స్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నాణ్యమైన రోగనిర్ధారణ సేవలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. శేరిలింగంపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన ‘తెలంగాణ ఉచిత డయాగ్నోస్టిక్, మినీహబ్’ సెంటర్ స్థానికులకు సేవలందిస్తున్నది. శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులను పెంచుకుంటూ అధునాతన పద్ధతుల్లో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
ఉచితంగా పరీక్షలు ..
రూ.10 వేల నుంచి 12 వేల వరకు ఖర్చుతో కూడిన డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రభుత్వం పేద ప్రజలకు ఈ సెంటర్ల ద్వారా ఉచితంగా అందిస్తున్నది. శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన నూతన డయాగ్నోస్టిక్స్ సెంటర్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్రే, ఈసీజీ అధునాతన పరీక్షలతో పాటు 57 రకాల రక్త, మూత్ర, గొంతు నమూనా పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణులు మహిళలతో పాటు సాధారణ ప్రజలకు అవసరమైన అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీ, ఎక్స్రే అధునాతన యంత్రాలు ప్రత్యేక క్యాబిన్ల ద్వారా ఈ కేంద్రంలో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు 57 రకాల రక్త, మూత్ర, గొంతు తెమడ నమూనా పరీక్షలు ప్రజలకు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రెడియాలజిస్టు డాక్టర్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు అందుబాటులో ఉన్నారు.
ఎంతో సంతోషంగా ఉంది
సీఎం కేసీఆర్ పేద ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని సర్కారు దవాఖానల్లో ఉచితంగా డయాగ్నోస్టిక్ సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఆర్థికంగా వెనకబడి ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లలేని మాలాంటి పేద ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంది. ముఖ్యంగా గర్భిణులకు అవసరమయ్యే స్కానింగ్లు ఈ సెంటర్ల ద్వారా నిర్వహించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం గర్భిణీ పరీక్షలు ఈసెంటర్లో ఉచితంగా చేయించుకోవడం సంతోషంగా ఉంది.
– పూజిత, పాపిరెడ్డి కాలనీ
ఉచిత సేవలు అభినందనీయం
ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు అందించని విధంగా మొదటిసారిగా ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత రోగ నిర్దారణ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గతంలో ఎటువంటి సమస్యా లేకుండా ప్రసవం చేయించుకున్నాను. నేడు ఉచితంగా ఎక్స్రే సైతం ఈ సెంటర్ ద్వారా చేయించుకోవడం సంతోషంగా ఉంది. పేదలకు ఉచిత వైద్యంతో పాటు మినీహబ్ కేంద్రాల్లో రోగ నిర్ధ్దారణ పరీక్షలు హర్షణీయం. పేదల ఆర్థిక భారాన్ని తొలగించే విధంగా ఉచిత వైద్య పరీక్షల సెంటర్ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
– ఫమీదాభేగం, చందానగర్