అబిడ్స్, మే 13 : వర్షాకాలంలో వర్షం నీరు సాఫీగా పోయేందుకు గాను జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఉన్న నాలాల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్ని సర్కిల్ కార్యాలయాల పరిధిలో ఉన్న నాలాల్లో పూడికతీత పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. జోన్ పరిధిలో రూ.10కోట్ల 76 లక్షల వ్యయంతో ప్రారంభమైన పనులు గత నెల రోజులుగా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్ పర్యవేక్షణలో ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ ఆధ్వర్యంలో నాలాల పూడికతీత పనులను చేపడుతున్నారు. ఆయా సర్కిల్ కార్యాలయాల పరిధిలో దాదాపు 70శాతం వరకు పనులు పూర్తి అయినట్లు ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ తెలిపారు. నాలాల్లో జేసీబీ సాయంతో పూడికతీత పనులు చేపట్టి అందులో నుంచి వెలికితీసిన మట్టిని ఆరిన వెంటనే డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తోప్ఖానా నాలా, మాలకుంట నాలా, అఫ్జల్సాగర్, సయ్యద్నగర్, బుల్కాపూర్, శివలాల్నగర్ నాలాలతోపాటు బస్తీల్లోని మురికి కాలువల నుంచి మట్టిని బకెట్ల ద్వారా తోడుతున్నారు. మే నెలాఖరుకల్లా మిగిలిన 40శాతం పూడికతీత పనులను
పూర్తి చేయించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద ్ధచూపుతున్నారు.
పూడికతీత పనులను పర్యవేక్షించిన ఎస్ఈ
జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల నాలాల్లో కొనసాగుతున్న పూడికతీత పనులను జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ పర్యవేక్షించారు. బేగంబజార్నాలా, శివలాల్నగర్ నాలాలో పూడికతీత పనులను ఆయన పర్యవేక్షించి త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో నీరు సాఫీగా పోయేలా పూడికతీత పనులపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. నాలాల్లో పూడికతీత పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు వివరించారు.