చిక్కడపల్లి, మే13 : గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ కమ్యూనిటీ హాల్ నిర్వహణ లేక పోవడంతో ఆధ్వానంగా మారింది. కమ్యూనిటీ హాల్ను అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వివాహ తదితర శుభకార్యాలు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అధునాతన ఫంక్షన్ హాల్ నిర్మించింది. అంతేగాక ఉన్న కమ్యూనిటీ హాల్ను అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నది. కానీ అధికారులు పట్టించుకోక పోవడంతో కమ్యూనిటీ హాల్ నిర్వహణ అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కమ్యూనిటీ హాల్ డివిజన్లోని జవహరనగర్, చిక్కడపల్లి అరుంధతినగర్, సబర్మతినగర్ తదితర బస్తీల, కాలనీల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఎక్కడా చూసినా చెత్తాచెదారం..
కమ్యూనిటీహాల్ చుట్టూ పరిసరాల్లో చెత్తా చెదారమే దర్శనం ఇస్తున్నది. వాడుకోవడానికి నీరు లేక శుభకార్యాలు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోర్ పాడుకావడంతో నీరు లేదు. మరమ్మతులు చేయించడం లేదని స్థానికులు వాపోతున్నారు. అదే విధంగా విద్యుత్ దీపాల సమస్య ఉందని అన్నారు. వంటగది, ట్యాయిలెట్లు అధ్వానంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని సమస్యలు పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. మౌలిక వసతులు కల్పిస్తాం. నీటి సమస్యను పరిష్కరిస్తాం, పేద, మధ్యతరగతి ప్రజలు వివాహ, శుభకార్యాలు నిర్వహించుకునే విధంగా అన్ని వసతులు కల్పిస్తాం.
– మైత్రేయి, ఏఎంఓహెచ్