బన్సీలాల్పేట్, మే 12: కరోనా సమయంలో నర్సులు అందించిన సేవలు ఎంతో గొప్పవని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని గురువారం గాంధీ వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా వైద్య, ఆరోగ్య, కుటుం బ సంక్షేమ శాఖ మంత్రి టి.హరీశ్ రావు హాజరయ్యారు. ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళిలర్పించారు. కరోనా సమయంలో వైద్య సేవలు అందించిన 110 మంది నర్సులను సన్మానించి, ప్రశంసా పత్రాలతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో కన్నవారు, కట్టుకున్న వారు కూడా దూరంగా ఉన్న కీలక సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించి, ఎందరో రోగులకు పునర్జన్మ ఇచ్చిన నర్సుల సేవలు అమోఘమని అన్నారు.
డాక్టర్లు కూడా కేవలం పది నిమిషాలు మాత్రమే రోగి వద్ద ఉంటారని, నర్సులు మాత్రం 24 గంటలు రోగిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని అన్నారు. అప్పుడే పుట్టిన శిశువును తన స్పర్శతో కదలిక తెచ్చే నర్సులు, రోగులందరికి ఆత్మీయతతో, ప్రేమతో తల్లిలాగా అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ నర్సుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఉమ్మడి పాలనలో 6 నర్సింగ్ కళాశాలలు ఉండగా, దానిని 16కు పెంచామని, రాబోయే రోజుల్లో మరిన్ని నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు గతంలో 1500 ఉన్న ైస్టెఫండ్ను సీఎం కేసీఆర్ ఏడు వేల వరకు పెంచారని గుర్తు చేశారు. 4722 నర్సింగ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామన్నారు. కొవిడ్ దశలో సేవలందించిన వారికి అందులో వెయిటేజి కూడా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు, డీఎంఈ డాక్టర్ కే.రమేశ్ రెడ్డి, నర్సింగ్ ఏడీ విజయ నిర్మల, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, గాంధీ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణ మోహన్, సికింద్రాబాద్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విద్యుల్లత, గాంధీ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ విజయ, ఇందిర, సుజాత, పుష్ప, బూబమ్మ, సులోచన, కృష్ణవేణి, అనిత తదితరులు పాల్గొన్నారు.