మణికొండ, మే 12 : నార్సింగిలో రియల్ మాఫియా హల్చల్ చేసింది. చారిత్రక దేవాలయ భూములను రాత్రికిరాత్రే ఆక్రమించేందుకు యత్నించగా, స్థానికులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నార్సింగి గ్రామ సర్వే నంబర్ 126లోని ఆరు ఎకరాల 08 గుంటల ప్రభుత్వం భూమి (పోసారం గుట్ట) ఉంది. ఇదే గుట్టపై సుమారు వంద సంవత్సరాల పైబడి నుంచి హనుమాన్ దేవాలయం ఉంది. ఇటీవల దేవాదాయశాఖ ఈ ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఆలయం చుట్టుపక్కల ఉన్న భూములను ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసి నిర్మాణాలను చేపట్టింది. ఆలయ పరిధిలోకి వచ్చే భూములను సైతం కలుపుకొని.. చదును పనులు చేపట్టింది. అయితే కొందరు స్థానికులు అడ్డుకోవడంతో పాటు నార్సింగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆక్రమిత భూమిలో ఏర్పాటు చేసిన కంటైనర్లను తొలగించేందుకు సిద్ధమవ్వగా, అక్కడ కాపలాగా ఉన్న సుమారు 30 మంది కిరాయి మనుషులు వారిపై రాళ్లతో దాడులకు దిగారు. గ్రామస్తులంతా మూకుమ్ముడిగా ముందుకు రావడంతో వారంతా జారుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకొని కంటైనర్లను తొలగించారు. అనంతరం ప్రభుత్వ భూమిలో చదును పనులను చేపట్టిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.