సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): ఎన్ఆర్ఐని మోసం చేసిన గోల్డ్స్టోన్ ఇన్ఫ్రా సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల ఫోరం జరిమానా విధించడంతో పాటు ఫ్లాట్ కోసం చెల్లించిన రూ.20 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. న్యూ నల్లకుంటకు చెందిన పి. శ్రీనివాస్ సంతోష్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. 2021 జనవరిలో గండిపేట మండలం పుప్పాలగూడలోని ‘మాప్ల్లే ఉడ్’ మూడో అంతస్తులోని 302 (1000 చ.ద అడుగులు) ఫ్లాట్ కొనుగోలు కోసం గోల్డ్స్టోన్ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులను సంప్రదించాడు. ఫ్లాట్ ఖరీదు రూ.53 లక్షలుగా నిర్ణయించారు. టోకెన్ అడ్వాన్స్ రూ.2 లక్షలు, మరో రూ.18 లక్షలకు చెక్కును జారీ చేసి సంస్థకు డబ్బులు చెల్లించారు. అయితే ఫ్లాట్కు సంబంధించిన వివరాలు, లింకు డాక్యుమెంట్లు ఎన్నిసార్లు అడిగినా సంస్థ ప్రతినిధులు స్పందించకుండా తిరస్కరిస్తూ వచ్చారు. సైట్ వద్దకు వెళ్లి చూడగా, 770 చ.ద అడుగు భవనం అని బోర్డు రాసి పెట్టడంతో కొనుగోలుదారుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. తమకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు సరైన సమయంలో ఫ్లాట్ తమకు అప్పగించలేదంటూ.. బాధితుడు హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-1ను ఆశ్రయించగా, గౌరవ సభ్యురా లు లక్ష్మీప్రసన్న పూర్వాపరాలు విచారించారు. కొనుగోలుదారుడు శ్రీనివాస్ సంతోష్ చెల్లించిన మొత్తం రూ.20 లక్షలను తిరిగి చెల్లించాలని, రూ.50 వేల నష్టపరిహారాన్ని బాధితుడికి అందజేయాలని, రూ.5వేల ఖర్చులను సైతం చెల్లించాలని ఆదేశించారు.
పేపర్ బ్యాగ్కు రూ.5 వసూలు చేస్తే..
వినియోగదారుడి నుంచి పేపర్ క్యారీ బ్యాగ్కు 5 రూపాయలు వసూలు చేస్తే.. 20వేలు చెల్లించాల్సి వచ్చిందో షాపింగ్ మాల్కు. దమ్మాయిగూడకు చెందిన ఎండీ రహీం 2019లో బంజారాహిల్స్లోని సిటీ సెంట్రల్ మాల్ సెకండ్ ఫ్లోర్లోని లైఫ్ైస్టెల్లో దుస్తులను కొనుగోలు చేశారు. అయితే క్యారీ బ్యాగ్కు రూ.5 చార్జి చేయడంపై స్టోర్ సూపర్వైజర్ను అడగ్గా.. ‘వినియోగదారులకు ఎవరికీ ఉచితంగా క్యారీ బ్యాగ్ ఇవ్వడం లేదు.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ.. గర్వంతో మాట్లాడారని సదరు కస్టమర్ వినియోగదారుల ఫోరం-3లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి చార్జి చేసిన రూ.5 తిరిగి చెల్లించడంతో పాటు రూ.20వేలు నష్టపరిహారంగా.. మరో వెయ్యి రూపాయలు ఖర్చుల కింద చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-3 అధ్యక్షులు రాంగోపాల్రెడ్డి ఆదేశించారు.