సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రాంతాల ఆధార్ కార్డులు.. పశ్చిమ బెంగాల్ నుంచి సిమ్కార్డులు.. జార్ఘండ్ చిరునామాలు.. ఇలా హ్యాకర్ శ్రీరామ్ దినేశ్కుమార్ పోలీసుల దర్యాప్తును దారి మళ్లించేందుకు అనేక ఎత్తుగడలు వేశాడు. సైబర్నేరాలకు అడ్డాగా ఉండే జార్ఖండ్లోని జామ్తారా చిరునామాలతో బోల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు. పేమెంట్ గేట్వేలోని పూల్ ఖాతాలను హ్యాక్ చేసి.. దోపిడీలకు పాల్పడిన శ్రీరామ్ దినేశ్కుమార్ అతడికి సహకరించిన చార్టెడ్ అకౌంటెంట్ చింటూ నాగసాయిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే దినేశ్కుమార్ సమాజంలో తాను బాగా సంపాదిస్తున్నట్లుగా చెప్పుకోవడం కోసం గేట్క్యాబ్, నైట్నెట్షాప్, డెయిలీబాస్కెట్ యాప్లను అడ్డుపెట్టుకొని.. హ్యాకింగ్ చేసి సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
వాటితోనే బ్యాంక్ ఖాతాలు..
హ్యాకర్ అనే అనుమానం ఎవరికీ అనుమానం రాకుం డా దినేశ్ చాలా జాగ్రత్తపడ్డాడు. ఒకసారి హ్యాక్ చేసిన చోటును మరో హ్యాకింగ్కు ఉపయోగించడు. కొన్ని మొబైల్ యాప్ల ద్వారా వివిధ ప్రాంతాల వారి చిరునామాలు, ఫొటోలు, ఆధార్కార్డులు సేకరించాడు. పశ్చిమబెంగాల్ నుంచి సిమ్కార్డులు తీసుకున్నాడు. ఆ ఆధార్కార్డులతోనే బ్యాంకులు, బిట్కైవ.కామ్లో ఖాతాలు తెరిచాడు. జార్ఖండ్కు చెందిన సోమ్నాథ్ పేరుతో ఆధారాలు, సెల్ఫీ ఫొటోలు సేకరించి.. ఖాతాలు ప్రారంభించాడు. పేజీ పూల్ ఖాతా నుంచి నగదును మరో బ్యాంక్ఖాతాకు బదిలీ చేసి.. అక్కడి నుంచి బిట్కాయిన్లోకి మళ్లించాడు. ఇక్కడ నెట్వర్క్ తెలియకుండా ఉండే ందుకు మరో వెబ్సైట్లోకి వెళ్లి బిట్కాయిన్లు విక్రయించి డబ్బు జమ చేసుకున్నాడు. అంతేకాకుండా సిమ్కార్డులకు ప్రత్యేకంగా ఒక ఫోను ఉపయోగించేవాడు. అది కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్లనే వాడేవాడు. నేరుగా డబ్బు లు ఇవ్వడంతో పాటు యాప్ల ద్వారా పేమెంట్ చెల్లించాడు. ఈ కేసు లో ఒక యూపీఐ ఖాతా నుంచి డబ్బును సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్మిన వ్యక్తికి పంపించడంతో దానిని సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు.