అమీర్పేట్, మే 12 :పేదలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మినీ హబ్’ల పేరుతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య పరీక్షలకు అవసరమయ్యే ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా అమీర్పేట్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రూ. 45 లక్షల వ్యయంతో అత్యాధునిక వసతులతో కూడిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మినీ హబ్ ఏర్పాటైంది. ఇందులో అత్యాధునిక డిజిటల్ ఎక్స్రేతో పాటు ఈసీజీ, అల్ట్రా సౌండ్ (యూఎస్జీ) పరికరాలున్నాయి. అయితే వీటి పనితీరుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్ తెలిపారు. అమీర్పేట లో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించ నున్నారు.
స్టెమీ సిస్టమ్ ద్వారా ఈసీజీ సేవలు
ఇక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఈసీజీ ద్వారా వైద్య సేవలు పొందుతున్న వారిని తెలంగాణ డయాగ్నోస్టిక్స్కు చెందిన వైద్యులు కేంద్ర కార్యాలయం నుండే పర్యవేక్షిస్తారు. స్టెమీ సిస్టమ్ ద్వారా కేంద్ర కార్యాలయానికి లింక్ అప్ చేయడం ద్వారా రోగుల పరిస్థితి ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తారు. ఇక్కడ రోగికి జరిగే ఈసీజీలో ఏమైనా అత్యవసర వైద్యానికి సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయా అనే అంశంపై కేంద్ర కార్యాలయంలో నుండే వైద్యులు పర్యవేక్షిస్తుంటారు. రోగికి సంబంధించిన పూర్తి వైద్య రిపోర్టులు కేవలం అయిదు నిమిషాల్లో అందుబాటులోకి వస్తాయని సిబ్బంది చెబుతున్నారు.
యూఎస్జీ ద్వారా పూర్తి స్థాయి సేవలు
అమీర్పేట్ ప్రభుత్వాసుపత్రికి వస్తుండే వారిలో ఎక్కువ శాతం గర్భిణులే ఉంటున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్ తెలిపారు. అమీర్పేట్ ప్రభుత్వాసుపత్రికి గర్భిణుల తాకిడి అధికంగా ఉందని, ఈ నూతన యూఎస్జీ ఏర్పాటు వల్ల మరింత మెరుగైన వైద్యం ఇక్కడ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.