కొండాపూర్, మే 12 : ప్రభుత్వ దవాఖానలకు విచ్చేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు రూ. 5లకే కడుపునిండా భోజనం పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్ర, హరేకృష్ణ మూవ్మెంట్ కాన్సెస్ (హెచ్కేఎంసీ)ల సంయుక్తంగా నిర్వహిస్తున్న రూ. 5ల భోజన కేంద్రాన్ని గురువారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో కార్పొరేటర్ హమీద్ పటేల్, దవాఖాన సూపరిండెంట్ డాక్టర్ వరదాచారిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ రూ. 60ల విలువ చేసే రుచికరమైన భోజనాన్ని దవాఖానకు విచ్చేసే రోగులు, అటెండర్లకు రోజుకు మూడు పూట లు 365రోజుల పాటు రూ. 5కే అందిస్తున్నట్లు తెలిపా రు. పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని దవాఖాన పరిసరాల్లోనే ఆహారాన్ని మూడు పూటలా అందిస్తున్నామన్నారు.
కొండాపూర్ జిల్లా దవాఖాన రాష్ట్రంలోనే ఉత్తమ దవాఖానగా నిలిచిందని, ఇన్ఫెక్షన్ ఫ్రీ దవాఖానగా కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ను సైతం పొందినట్లు తెలిపారు. గతంలో నెలకు 20 నుంచి 30 సాధారణ ప్రసవాలు జరిగేవని, ప్రస్తుతం 220 నుంచి 230 సాధారణ ప్రసవాలు జరుగున్నట్లు తెలిపారు. ఇటీవలె ప్రముఖ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దవాఖానలో ఒక అంతస్తును పూర్తి స్థాయిలో నిర్మించినట్లు తెలిపారు. దవాఖానలో అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు, రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఊట్ల క్రిష్ణ, శ్రీనివాస్ యాదవ్, క్రిష్ణ గౌడ్, చాంద్పాషా, దవాఖాన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.