అబిడ్స్/సుల్తాన్బజార్/మెహిదీపట్నం, మే 12 : ఆర్థిక స్థోమత లేని ప్రజలకు అనారోగ్యం ఏర్పడితే నగరంలోని ప్రభుత్వ దవాఖానలకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి రోగులు చికిత్స పొందుతుంటారు. దవాఖానలకు వచ్చే వారికి రూ.5లకే అడిగినంత భోజనం అందిస్తున్నట్లు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు తెలిపారు. గురువారం ఈఎన్టీ దవాఖానలో ఐదు రూపాయల భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. కోఠి ఈఎన్టీ, రెడ్హిల్స్లో ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన, మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి దవాఖాన, నిలోఫర్ గర్భిణీలు, చిన్న పిల్లల ప్రభుత్వ దవాఖానలు ప్రత్యేకంగా ఉన్నాయి. వీటితోపాటు ఉస్మానియా దవాఖాన, సుల్తాన్బజార్ మెటర్నిటీ దవాఖాన, కింగ్కోఠి జిల్లా దవాఖాన, నాంపల్లి ఏరియా దవాఖానలు ఉన్నాయి. ఆయా దవాఖానల్లో చికిత్స కోసం ప్రతినిత్యం వేలాది మంది రోగులు వస్తుంటారు.
నగరంలో బంధువులులేక బయట హోటళ్లలో నిత్యం వంద రూపాయలకు పైగా డబ్బులు చెల్లించలేక వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వీటన్నింటిని గుర్తించిన ప్రభుత్వం హరేకృష్ణ మూవ్మెంట్ ద్వారా అన్ని దవాఖానల్లో మూడు పూటలా ఐదు రూపాయల భోజనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి ప్రారంభించారు. ప్రతి నిత్యం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందుబాటులో ఉంచి అందించనున్నారు. దీంతో దవాఖానల్లోని రోగులు, రోగి సహాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోషామహల్, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానలు, ఏరియా దవాఖానల్లో ఈ భోజనామృత కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రోగి సహాయకులకు మూడు పూటల భోజనం అందనున్నది. ఉస్మానియా దవాఖాన, కోఠి ఈఎన్టీ, సుల్తాన్బజార్ మెటర్నిటీ, కింగ్కోఠి దవాఖాన, ఎంఎన్జే, నిలోఫర్ దవాఖానలతోపాటు సరోజినిదేవి కంటి ఆసుపత్రి, నాంపల్లి ఏరియా దవాఖానలలో ఈ భోజనామృత కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 నుంచి 2గంటల వరకు లంచ్, సాయంత్రం 6 నుంచి 8గంటల వరకు డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి కేంద్రంలో మూడు పూటలు..
గోషామహల్, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేసిన భోజనామృత కేంద్రాల ద్వారా మూడు పూటలా భోజనాన్ని అందుబాటులో ఉంచి ఐదు రూపాయలకు విక్రయించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రోగి సహాయకులకు వరంలా మారింది.
సంతోషంగా ఉంది
ప్రభుత్వ దవాఖానల్లో మూడు పూటలా ఐదు రూపాయల భోజనాన్ని అందించడం సంతోషంగా ఉన్నది. నగరంలో బంధువులులేక ఆహారం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ భోజనం పథకం ఎంతో ఉపయోగపడుతుంది. నిత్యం పదిహేను రూపాయలతోనే కడుపు నిండా భోజనం లభించడం ఆనందకరం. – మద్దిలేటి, కర్నూలు జిల్లా
రూ.15లతో కడుపునిండా భోజనం
దవాఖానల్లో చికిత్స పొందేందుకు వచ్చే వారు బయట తినాలంటే బాగా ఖర్చవుతుంది. దవాఖానాలలో ప్రభుత్వం మూడు పూటలా రూ.ఐదు భోజనాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉన్నది. కూతురు ఆరోగ్యం కోసం తాను ఇరవై రోజులుగా సుల్తాన్బజార్ మెటర్నిటీ దవాఖానలో ఉంటున్నాం. ఈ భోజనం రోగి సహాయకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.- శాంత, బోరబండ