ముషీరాబాద్, మే 12: వానాకాలంలో వరద నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ సర్కిల్-15 ఇంజినీరింగ్ విభాగం అధికారులు నాలాల పూడికతీత పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. సర్కిల్ పరిధిలోని పది కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన నాలాలతోపాటు, వరద నీటి పైపులైన్లలో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు. గత రెండు వారాలుగా నాలాల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు. త్వరలో వానాకాలం మొదలు కానున్న నేపథ్యంలో దృష్టిసారించిన అధికారులు వేగవంతంగా పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు. రూ 1.54 కోట్ల వ్యయంతో ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో పూడితీత పనులు చేపడుతున్నారు. మున్సిపల్ డివిజన్లలోని ప్రధాన నాలాలు, వరద నీటి పైపులైన్లు, మ్యాన్హోళ్లలో పూడికను తొలగిస్తున్నారు.
వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు..
పూడిక తొలగింపుతోపాటు నాలా ప్రహరీల నిర్మాణం, రక్షణ వలయాల ఏర్పాటు చేపడుతున్నారు. నాలాలు, వరద నీటిపైపులైన్లు, ఓపెన్ నాలాల్లో పూడిక తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పైపులైన్లు, చిన్నపాటి ఓపెన్ నాలాల్లో బకెట్ క్లీనింగ్ విధానం ద్వారా పూడిక తొలగిస్తున్నారు.
త్వరలో పనులు పూర్తి చేస్తాం..
నాలాల పూడికతీత పనులు 75 శాతం పూర్తి చేశాం. ఈ నెల 25 నాటికి పనులను పూర్తి చేస్తాం. వర్షాకాలం మొదలయ్యే నాటికి వరద నీటి సమస్య తలెత్తకుండా చర్యగా తీసుకుంటున్నాం.
-సన్నీ, డీఈ సర్కిల్-15