కుటుంబం బాగుండాలని ఓ తండ్రి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును తల్లి అల్లారుముద్దుగా పెంచుతుంది. అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తుంది. కాలేజీలకు సెలవులు కావడంతో కుమారుడు స్నేహితులతోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి గంజాయి అలవాటు అయింది. ఇది వ్యసనంగా మారడంతో నిత్యం మత్తులోనే ఉంటున్నాడు. కొడుకు పరిస్థితి చూసిన తల్లి మనసు తల్లిడిల్లిపోయింది. తన కుమారుడిని మార్చమని ఆ తల్లి బచపన్ బచావో ఆందోలన్ సంస్థను ఆశ్రయించింది.
నగరంలోని.. ఓ బస్తీలో ఉండే కుటుంబంలో ఇంటి పెద్ద కాలం చేశాడు. తల్లి ఇండ్లలో పని చేసుకుంటూ కొడుకును చదివిస్తున్నది. సంపాదన సరిపోకపోవడంతో సమయం చిక్కినప్పుడల్లా కూలీ పని కూడా వెళ్తుంది. కరోనా దెబ్బతో పాఠశాలలు సరిగా నడవడం లేదు. ఆన్లైన్ తరగతులు అని కొడుకుకు సెల్ఫోన్ కూడా ఇచ్చింది. అయినా కొడుకు సరిగా తినడం లేదు. అర్థరాత్రి సమయంలో ఇంటికి వస్తున్నాడు. అడిగితే లొల్లి చేస్తున్నాడు. కొడుకు తీరుతో ఆందోళన చెందిన ఆ తల్లి చివరకు బచ్పన్ ఆందోళన్ సంస్థ నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో తన బాధను మొరపెట్టుకుంది.
సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ) :కన్న కొడుకుల పరిస్థితిని కండ్లారా చూస్తున్న తల్లుల గుండెలు పగులుతున్నాయి. కరోనాతో విద్యాసంస్థలు సరిగా నడవకపోవడంతో దోస్తానా పెరిగి అధిక సమయం విద్యార్థులు, యువకులు బయటే గడుపుతున్నారు. అర్థరాత్రులు ఇంటికి వస్తున్నారు. అడిగితే లొల్లి చేస్తున్నారు. ఇలా నగరంతో పాటు శివారులోని బస్తీలు, కాలనీలలో విచిత్ర పరిస్థితి నెలకొంటుందని బచపన్ బచావో ఆందోళన్ సంస్థ నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో బాధిత తల్లులు ఈ ఫిర్యాదులతో కన్నీరు పెట్టుకుంటున్నారు.
గంజాయి పోయి వైట్నర్ వచ్చింది…
ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్పై కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు చాలా మంది వైట్నర్పై ఆధారపడుతున్నారు. మత్తుకు అలవాటైన వారు డ్రగ్స్, గంజాయి దొరకకపోవడంతో స్టేషనరీ షాపుల నుంచి వైట్నర్లను కొనుగొలు చేసి దానిని కర్చీఫ్లో వేసుకుని పీలుస్తున్నారు. ఈ విషయాన్ని చాలా మంది అమ్మలు బచ్పన్ బచావో ఆందోళన్ అవగాహన కార్యక్రమాల్లో తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ అలవాటుకు పడుతున్న వారి వయస్సు ఇప్పుడు 8 ఏండ్ల నుంచే ప్రారంభమవుతుండడంతో కలవరాన్ని రేపుతోంది. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారిలో అధికంగా రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్న బస్తీలు, కాలనీలలో నివాసం ఉంటున్న యువతే ఉంటున్నారు. ఈ ప్రాంతాలలో ఉండే యువకులకు అధికంగా గంజాయి, వైట్నర్, డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఈ ట్రాక్ల వెంబడి నిఘా ఉన్నప్పటికీ చాలా మంది యువకులు పోలీసు పెట్రోలింగ్, గస్తీ పెట్రోలింగ్ సమయాలను తెలుసుకుని గంటల వ్యవధి తేడాను పెట్టుకుని అక్కడ తిష్ట వేస్తు ఈ మత్తును ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఎవరు వెళ్లి నిలదీసినా ఎదురుదాడే ఉంటుంది.
అందరికీ బాధ్యత ఉండాలి…
మత్తును వదిలించేందుకు ప్రభుత్వం, పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాని పౌరులు బాధ్యతను విస్మరిస్తున్నారు. పిల్లలు మత్తుకు అలవాటైన్పప్పుడు మానసిక నిపుణులను సంప్రదిస్తున్నారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. బస్తీలు, కాలనీల చుట్టూ యువకుల సంచారంపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. పరువు పోతుందనే భయంతో పిల్లల మత్తు విషయాన్ని దాచేస్తున్నారు. ఇలా దాచడంతో అది పెరిగి విషమంగా మారి ఆ కుటుంబంలోనే దీన పరిస్థితులకు కారణమవుతోంది. కాబట్టీ అందరిలో బాధ్యత ఉండాలి. ఇంట్లోకి గంజాయి, డ్రగ్స్, వైట్నర్ మత్తు వాసన వచ్చినప్పుడే స్పందిస్తే పోలీసులకు వెంటనే ఆ అలవాటు, దందా చేస్తున్న వారిని పట్టుకునేందుకు మార్గం ఏర్పడుతుంది.
బాధ్యతగా ఉంటే భవిష్యత్ పిల్లలదే
పిల్లలు, యువత భవిష్యత్తును కాపాడేందుకు మేము బస్తీలు, కాలనీలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రతి చోట మాకు పిల్లలు మత్తుకు అలవాటై విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని తల్లులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చినా సరిపోవడం లేదు. స్కూల్ కమిటీలు, ఇంట్లో కుటుంబ సభ్యులు, కాలనీలలో పెద్దలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు.. ఇలా ప్రతి ఒకరు బాధ్యతగా ఉండాలి. పోలీసులకు, ప్రభుత్వానికి సహకరించాలి. అందరూ బాధ్యతగా ఉంటే పిల్లల మత్తును వదిలించి భవిష్యత్తును తీర్చిదిద్దడం సులభమే. పిల్లల అంశాలకు సంబంధించి బచ్పన్ బచావో ఆందోళన్ టోల్ ఫ్రీ-నెంబరు 18001027222కు సంప్రదించాలి.