లంబోదరుడి నవరాత్రి సంబురాలు గ్రేటర్వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆదివారం 5వ రోజు కావడంతో ట్యాంక్బండ్తోపాటు వివిధ
చెరువుల్లో గణనాథులను నిమజ్జనం చేశారు. రుద్రసేన ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాసిగూడ వద్ద నిర్వహించిన వరసిద్ధి వినాయకుడి కల్యాణోత్సవం రమణీయంగా సాగింది.
దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. అంటూ భక్తులు బొజ్జ గణపయ్యకు ఘనమైన పూజలు నిర్వహిస్తున్నారు. మండపాలన్నీ “ఓం గం గణపతియే నమః” నామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయం, సాయంత్రం విఘ్నేశ్వరుడికి వేదపండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేధ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. విఘ్నాలు తొలగాలని విఘ్నాధిపతిని వేడుకుంటున్నారు. మండపాల్లో కొలువుదీరిన తీరొక్క రూపాల్లో ఉన్న విఘ్నేశ్వరుడి ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి మేళ తాళాలు, భక్తజన సందోహం నడుమ నిమజ్జనానికి తరలిస్తున్నారు. నిమజ్జన కొలనుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో ఆదివారం శ్రీ రాధాష్టమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. ఈ సందర్భంగా శ్రీ రాధా గోవిందులకు 108 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించడంతో పాటు నూతన వస్ర్తాలంకరణ చేశారు. అనంతరం శ్రీ రాధాష్టకం పేరుతో ప్రత్యేక గీతాలు, కీర్తనలను ఆలపించారు. 56 రకాల ప్రత్యేక వంటకాలతో చప్పన్ భోగ్ సమర్పించారు. అనంతరం హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు సత్యచంద్ర గౌరదాస చేతులమీదుగా రాజభోగ హారతి నిర్వహించారు. – బంజారాహిల్స్, సెప్టెంబర్ 4
దుండిగల్, సెప్టెంబర్ 4: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 26వ డివిజన్లోని ప్రశాంతిహిల్స్ కాలనీలో కాలనీ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో రూ.8 లక్షల 116 పలికింది. స్థానికులు మేకల రవి, రచ్చ చక్రధర్, వేణుకొండా, అరవింద్, యుదిష్టర్, రామకృష్ణ సంయుక్తంగా
వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. కాగా గత ఏడాది లడ్డూ రూ.3.5లక్షలు పలికింది.