సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిలిపి వేసిన సికింద్రాబాద్- పుణె ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 10న నుంచి తిరిగి పునరుద్ధరించారు. ఈ ఎక్స్ప్రెస్ రైలులో కొత్తగా విస్టాడోమ్ కోచ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో విస్టాడోమ్కు ప్రయాణికుల నుంచి భారీ ఆదరణ లభిస్తున్నదని శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. జోన్ పరిధిలో విస్టాడోమ్తో నడిచే తొలి రైలు కూడా ఇదేనన్నారు. ఈ సర్వీసులు సికింద్రాబాద్- పుణె మధ్య ప్రారంభించిన తొలి రోజే 63 శాతం ప్రయాణికులు నమోదైనట్లు తెలిపారు. అయితే, లింక్ హఫ్మాన్ బుష్ (ఎల్హెచ్బీ) కోచ్లతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు విస్టాడోమ్ కోచ్ను చేర్చడం వల్ల అదనపు ఆకర్షణగా మారిందన్నారు.
విస్టాడోమ్ కోచ్లో ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఈ కోచ్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సీటులో కూర్చున్న సమయంలో వెనక్కి జరిగేలా, సీటు చుట్టూ తిరుగుతుంది. తలుపులకు అద్దాలు అమర్చారు. అదేవిధంగా విద్యుత్ సహాయంతో కోచ్ తలుపులు పక్కకు తెరుచుకునేలా ఏర్పాటు చేశారు. అద్దాలు అమర్చడంతో ప్రయాణికులు తాము కూర్చున్న సీట్లో నుంచే ప్రకృతి అందాలు చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కోచ్లో ప్రయాణానికి ఒక్కొక్కరికీ రూ.2110 చొప్పున టికెట్ చార్జి చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ తరగతి కోచ్లో రూ.1935 వసూలు చేస్తున్నారు. ఈ రైలు సికింద్రాబాద్లో మధ్యాహ్నం 14.45 గంటలకు బయలుదేరి, అదేరోజు రాత్రి 23.10 గంటలకు పుణె చేరుకుంటుంది. అలాగే పుణెలో ఉదయం 6 గంటలకు బయలు దేరి అదే రోజు మధ్యాహ్నం 14.20 గంటలకు చేరుకుంటుంది.
ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్- తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 15 నుంచి 18 వరకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు వెల్లడించారు. అలాగే ఈ నెల 13, 14, 15 తేదీల్లో నర్సాపూర్- సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య 2 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలిపారు.