మేడ్చల్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సం చేయనున్న నేపథ్యంలో భవనాన్ని పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు ఆదేశించారు. అంతాయిపల్లి కలెక్టరేట్ నూతన భవనాన్ని రంగారెడ్డి ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, జిల్లా కలెక్టర్ హరీశ్తో కలిసి మంత్రి మల్లారెడ్డి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కలెక్టరేట్ భవనంలో కలియతిరిగి అభివృద్ధి పనులు, ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్లతో అన్ని హంగులతో నూతన కలెక్టరేట్ను నిర్మించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రారంభోత్సవానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నందున జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి వారికి అప్పగించిన బాధ్యతలను ఏ మాత్రం పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా చేయాలన్నారు.
ప్రారంభోత్సవ సభ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 12 వేల మంది వస్తారని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. మంత్రి వెంట ఆర్ అండ్ బీ అధికారి సి.గణపతిరావు, ఇంటలీజెన్స్ ఎస్పీ ఎన్వీ కృష్ణారావు, జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్, సీఈవో దేవ సహాయం, అధికారులు పద్మజా రాణి, శ్రీనివాస్, నీరజాగాంధీ, శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు ఉన్నారు.
కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో అధికారులంతా బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో ఖాళీ స్థలాలు లేకుండా మొక్కలు నాటాలని, శానిటైజేషన్, చెత్తా చెదరాం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉండి విద్యుత్ అంతరాయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.