సికింద్రాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 12: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా శుక్రవారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రాఖీల కొనుగోలు కేంద్రాలన్నీ మహిళలు, యువతులతో కిక్కిరిసిపోయాయి. ఆయా పార్టీల నాయకులకు సోదరీమణులు, మహిళలు వచ్చి రాఖీలు కట్టారు.
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్కు కంటోన్మెంట్లోని మహిళలు రాఖీలు కట్టారు. టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డికి మహిళలు, అంగన్వాడీ టీచర్లు రాఖీలు కట్టగా, ఆశ కార్యకర్తలు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డికి రాఖీలు కట్టారు.
దీంతో పాటు కార్ఖానాలోని ఎమ్మెల్యే సాయన్న క్యాంపు కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మాజీ కార్పొరేటర్ లాస్యనందితా రాఖీ కట్టారు.అదే విధంగా రసూల్పురాలో మైనార్టీ మహిళలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్కు రాఖీలు కట్టారు.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక డివిజన్లలో ఘనంగా జరుపుకున్నారు. డిప్యూ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి నివాసంలో ఆమె భర్త, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డికి ఆయన తోబుట్టువులు రాఖీలు కట్టారు. టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు సైతం ఆయనకు రాఖీలు కట్టారు.