మాదాపూర్, ఆగస్టు 12: యువతతోనే ఏదైనా సాధ్యమని, యువత తలుచుకుంటే సాధించలేనిదంటు ఏమి ఉండదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యులు ఈ. వెంకటేశ్ అన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్లోని తేపాక్షి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యువజన దినోత్సవానికి శుక్రవారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్తో పాటు కళాశాల అధ్యాపకులతో కలిసి హాజరై విద్యార్థులకు అంతర్జాతీయ యువజన దినోత్సవంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని అన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. యువత విలువలతో కూడిన గుణాత్మకమైన విద్యను అందిపుచ్చుకోవడం జరుగుతుందని అన్నారు. విద్య ఎన్నటికీ తరగని సంపద అని అన్నారు. ఆధునిక టెక్నాలజీతో నేటి సమాజానికి కావలసిన విజ్ఞానాన్ని, జీవన స్థితిగతులను పెంచుకోవడం కొరకు యువత సిద్ధంగా ఉండాలని అన్నారు.
18 నుంచి 32 సంవత్సరాల యువత విద్యతో పాటు కల్చరల్ యాక్టివిటీని అభివృద్ధి చేసుకోవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. మనసును శరీరాన్ని ఏకం చేసి ఏకాత్మతతో స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు తదితరులు ఉన్నారు.