కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రజలందరూ భాగస్తులై వైభవంగా జరుపుకోవాలని.. దేశం కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు.
జడ్సీ మమత, జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు రవికుమార్, రవీందర్కుమార్, ఎస్ఈ చిన్నారెడ్డితో పాటు పలువురు ఉద్యోగులకు రాఖీలు కట్టి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుందని ఇప్పటికే కాలనీలు బస్తీలలో జాతీయ జెండాలను పంపిణీ చేసిందన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని.. ప్రతీ గుండెలో జాతీయ స్ఫూర్తిని నింపుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ గోకుల్ ప్లాట్స్లో సహృదయ వృద్ధాశ్రమంలో భారత వజ్రోత్సవ, రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వృద్ధాశ్రమంలో జాతీయ జెండాలను అందించి వృద్ధులకు రాఖీలను కట్టి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సంస్థ కో ఆర్డినేటర్ అఫ్రిన్ ఫర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని వివేకానందనగర్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి అన్నారు. శుక్రవారం వివేకానందనగర్ ఈనాడు కాలనీలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలందరూ భాగస్తులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పురేందర్ రెడ్డి, శ్రీధర్, వెంకటేశ్వర్రావు, సూర్యనారాయణ, స్థానిక నేతలున్నారు.